జగన్ సర్కార్ కు కేసీఆర్ షాక్- తెలంగాణలో టికెట్ల ధరల పెంపు-జీఎస్టీ వసూలుకూ సై
ఏపీలో ఓవైపు వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచకుండా థియేటర్లకు అడ్డుకట్ట వేస్తున్న వేళ కేసీఆర్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ల ధరల్ని పెంచుకునేందుకు అనుమతిస్తూ ఇవాళ నిర్ణయం ప్రకటించింది. దీంతో పాటు టికెట్ ధరలపై జీఎస్టీ వసూలు చేసుకునేందుకు సైతం అనుమతిచ్చింది. దీంతో కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు
తెలంగాణలో టాలీవుడ్ సినిమా థియేటర్లలో టికెట్ల ధరల్ని పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఓవైపు పొరుగున ఉన్న ఏపీలో సినిమా టికెట్ల ధరలు పెంచకుండా థియేటర్లపై వైసీపీ సర్కార్ దాడులు చేస్తున్న వేళ.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం థరలు పెంచుతూ అనుమతి ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది కొంతకాలంగా టాలీవుడ్ నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.

టికెట్ ధరల పెంపు ఇలా
కేసీఆర్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని ఏసీ థియేటర్లలో కనీస టికెట్ ధరను రూ.50 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే గరిష్ట టికెట్ ధరను రూ.150గా నిర్ణయించారు. అలాగే నాన్ ఏసీ థియేటర్లలో కనీస టికెట్ ధర రూ.30గా, గరిష్ట టికెట్ ధర రూ.70గా నిర్ణయించారు. అలాగే మల్టీప్లెక్స్ లలో కనీస టికెట్ ధర రూ.100 గానూ, గరిష్ట టికెట్ ధర రూ.250కి పెంచారు. అలాగే స్పెషల్ రిక్లెయినర్ సీట్లకు అయితే రూ.300 వరకూ వసూలు చేసుకునే అవకాశం కల్పించారు.

టికెట్ల ధరలపై జీఎస్టీ
తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆయా టికెట్ల ధరలపై జీఎస్టీ నిసైతం వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ధియేటర్ల యజమానులతో పాటు డిస్టిబ్యూటర్లకు సైతం ఇదో భారీ ఊరటగా మారనుంది. ఇప్పటివరకూ జీఎస్టీ వసూలు చేసుకునే అవకాశం లేకపోవడంతో టికెట్ ధరలోనే జీఎస్టీని కలిపి థియేటర్లు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఊరట కలగబోతోంది.

జగన్ కు కేసీఆర్ షాక్
ఏపీలో ఓవైపు సినిమా థియేటర్ల టికెట్ల ధరల్ని పెంచకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తున్న నేపథ్యంలో అవే సినిమా టికెట్లను పెంచుకునేందుకు కేసీఆర్ అనుమతి ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో సహజంగానే వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరగబోతోంది. ఇప్పటికే జగన్ సర్కార్ చర్యలపై టాలీవుడ్ తో పాటు ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రభావం కచ్చితంగా వైసీపీ సర్కార్ పై పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications