హైడ్రాకు మరింత పవర్: భారీగా సిబ్బంది కేటాయింపు
హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా బలోపేతానికి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. బుధవారం హైడ్రాకు అదనంగా సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 169 మందిని హైడ్రా కోసం కేటాయించింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్ఐలు, 60 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లను డిప్యూటేషన్ పై హైడ్రా కోసం పనిచేయనున్నారు.
అంతేగాక, ముగ్గురు రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఆరుగురు రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు, సమాచారానికి సంబంధించి ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, అనలైటికల్ ఆఫీసరు, డిప్యూటీ అనలైటికల్ ఆఫీసర్, అసిస్టెంట్ అనలైటికల్ ఆఫీసర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్, అడిషనల్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్, సిటీ ప్లానర్, ముగ్గురు డిప్యూటీ సిటీ ప్లానర్, నీటిపారుదలకు సంబంధించి ఒక ఈఈ, ముగ్గురు డీఈలు, పబ్లిక్ హెల్త్ నుంచి ఇద్దరు డీఈలు, ఆర్థిక శాఖ నుంచి ఒక డిప్యూటీ సెక్రటరీ, డిప్యూటీ కలెక్టర్, ముగ్గురు తహసీల్దార్లు, ముగ్గురు సర్వేయర్లను ప్రభుత్వం హైడ్రా కోసం నియమించింది. అదనపు సిబ్బంది కేటాయింపుతో హైడ్రా మరింత దూకుడుగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని స్పష్టం చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలి. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలి. చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలి. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటికీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలి. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతీ చెరువు, నాలాల ఆక్రమణల వివరాలతో పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.
ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలి. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలి. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలి. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్పై పూర్తిస్థాయి డీపీఆర్ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.












Click it and Unblock the Notifications