చినజీయరుస్వామి సమతామూర్తి ఆశ్రమంపై కేసు??
చినజీయరుస్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన సమతామూర్తి రామానుజాచార్యులవారి విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులపై కేసు నమోదైంది. రామానుజాచార్యులవారిని సందర్శించేందుకు నిత్యం భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ అమ్మే ప్రసాదంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఒక భక్తుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రసాదం ప్యాకెట్ పై వివరాలు లేకపోవడంతో..
ఒక భక్తుడు సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. ఆ ప్రసాదం ప్యాకెట్పై తయారుచేసిన తేదీ, కాలపరిమితి లాంటి వివరాలేవీ ప్రచురించలేదు. అంతేకాకుండా బరువు విషయంలో కూడా తేడా ఉంది. దీంతో కౌంటర్లలో ఉన్నవారికి, సమతామూర్తిని పర్యవేక్షిస్తున్నవారికి ఆయన ఫిర్యాదు చేశారు. కానీ వారెవరూ స్పందించలేదు. దీంతో ఆయన తూనికలు, కొలతలశాఖ కు మెయిల్ద్వారా ఫిర్యాదు పంపించారు.

నిర్వాహకులపై కేసు నమోదు
తూనికలు, కొలతలశాఖ అధికారులు వెంటనే అక్కడకు చేరుకొని ప్రసాదం ప్యాకెట్లను తనిఖీ చేశారు. బరువు తూచారు. వివరాలన్నింటినీ నమోదు చేసుకొని భక్తుడు చేసిన ఫిర్యాదు మేరకు మెట్రాలజీ యాక్ట్ 2009 సెక్షన్లు 10, 11, 12, 8/25 నిబంధనలను ఉల్లంఘించినందుకు అక్కడి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

చినజీయరుకు, ముఖ్యమంత్రికి పెరిగిన దూరం?
సాధారణంగా ఇటువంటి విషయాల్లో కేసులు నమోదు కావడం అరుదు. కానీ సమతా మూర్తి విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన శిలాఫలకంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు నమోదు చేయలేదు. ప్రధానమంత్రి మోడీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాలేదు. ఆ తర్వాత నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పాలకులు, అధికారులు అందరూ సమతామూర్తి ఏర్పాటు చేసిన ప్రదేశానికి, చినజీయరుస్వామికి దూరం జరుగుతూ వచ్చారు. యాదాద్రి ఆలయ పునంప్రారంభోత్సవానికి కూడా చినజీయరు హాజరు కాలేదు. అప్పటినుంచి చినజీయరు స్వామి కూడా విజయవాడకు సమీపంలోని విజయకీలాద్రి పర్వతంపై ఉన్న ఆశ్రమంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.












Click it and Unblock the Notifications