గ్రేటర్కు శుభవార్త: అక్రమ లేఔట్లు, భవనాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్, ఛార్జీలివే
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ లేఔట్లు, అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకానికి సంబంధించిన ఉత్తర్వులు సోమవారం జారీ అయ్యాయి. పూర్తి వివరాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

నగరంలోని అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కేవలం పేదలకు మేలు చేసే ఉద్దేశంతోనే చేపట్టామని మంత్రి తలసాని అన్నారు. సబ్ కమిటీ సూచనల మేరకు భూముల క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు ఏర్పాటు చేశామన్నారు. అక్టోబర్ 28వ తేదీని కటాఫ్ డేట్ గా నిర్ణయించామని మంత్రి తెలిపారు.

60 రోజుల లోపు రూ. 10వేలు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అక్రమ లేఔట్లను న్యాయ సలహాలతోనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. అక్రమ కట్టడాల పూర్తి బాధ్యత ఆ ప్రాంత టౌన్ ప్లానింగ్ అధికారిదేనన్నారు. అక్రమ భవనాలను క్రమబద్ధీకరించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గడువు పూర్తయిన తరువాత ఎలాంటి దరఖాస్తులను స్వీకరించమని, గృహావసరాలు, వాణిజ్య సముదాయాలకు వేర్వేరుగా జరిమానా వసూలు చేస్తామన్నారు. భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. గూగుల్ మ్యాప్ల ద్వారా అక్రమ భవనాలు గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు తలసాని తెలిపారు.
బీఆర్ఎస్ క్రమబద్ధీకరణ చార్జీలు:
* 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఉన్న ప్లాట్లకు కనీస ఛార్జీ రూ. 12,500
* 601 - 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ప్లాట్లకు రూ. 25,000
* 1201 - 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ప్లాట్లకు రూ. 40,000
* 2000 చదరపు అడుగుల పైన విస్తీర్ణం గల ప్లాట్లకు రూ. రూ. 60,000
* గృహ అవసరాలు, వాణిజ్య సముదాయాలకు వేర్వేరు చార్జీలు వర్తిస్తాయి.

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ చార్జీలు:
* 100 లోపు చదరపు మీటర్ల ప్లాట్లకు ప్రతి చ.మీకు రూ.200
* 101-200 చదరపు మీటర్ల ప్లాట్లకు ప్రతి చ.మీకు రూ. 400
* 301-500 చదరపు మీటర్ల ప్లాట్లకు ప్రతి చ.మీకు రూ.600
* 500పైన చదరపు మీటర్ల ప్లాట్లకు ప్రతి చ.మీకు రూ.750
* మురికివాడల్లో నివసించే వారి స్థలాల క్రమబద్ధీకరణకు ప్రతి చ.మీకు రూ. 5 చార్జీ వసూలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications