దళితబంధు పథకానికి అదనపు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ : దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితుబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు విధి విధానాలను జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను ప్రకటిస్తూ ఎస్సీ అభివృద్ధిశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది.
లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక దళితబంధు కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరవాలని, సంబంధిత పాసు పుస్తకాలను లబ్ధిదారులకు అందించాలని తెలిపింది. ఆ ఖాతాలోకి రూ. 9.90 లక్షలు కలెక్టర్ బదిలీ చేయాలని పేర్కొంది.
లబ్ధిదారులను వారు ఆసక్తి కనబర్చే యూనిట్లను బట్టి గ్రూపులుగా వర్గీకరించాలని, వ్యవసాయం-అనుబంధ రంగాలు, రవాణా రంగం, తయారీ-పరిశ్రమ రంగం, రిటైల్ దుకాణాలు, సేవలు-సరఫరా రంగాలుగా విభజించాలని పేర్కొంది. ఆయా రంగాల వారీగా రిసోర్స్ పర్సన్స్ ను ఎంపిక చేయడంతోపాటు బృందాలను కలెక్టర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
రూ. 10 లక్షలు యూనిట్ వ్యయం అయ్యే ప్రాజెక్టులను రిసోర్స్ బృందాలు రూపొందించాలి. మొత్తం రూ. 10 లక్షలు విలువ చేసేలా రెండు సబ్ యూనిట్లు కూడా ఉండొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఒకరి కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు కలిసి ఎక్కువ మొత్తంతో పెద్ద యూనిట్కు కూడా అవకాశం ఇవ్వాలని తెలిపింది.
రిసోర్స్ బృందాలతో కలెక్టర్ లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారికి వివిధ యూనిట్లపై అవగాహన కల్పించాలి. అవసరమైతే రిసోర్స్ బృందాలు ఎక్కువసార్లు కూడా లబ్ధిదారుల వద్దకు వెళ్లాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారుని ప్రాధాన్యం, ఆసక్తి, అనుభం, యూనిట్ ఆర్థిక సాధ్యాసాధ్యాలను యూనిట్ ఎంపికలో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ల ఖరారు అనంతరం వారికి అందులో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఆయా రంగాలు, యూనిట్ల అవసరాల దృష్ట్యా రెండు నుంచి ఆరు వారాలపాటు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. అదే సమయంలో లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల పరిశీలన కోసం పర్యటనలు ఏర్పాటు చేయాలని, ఆయా రంగాల్లో విజయవంతమైన వారిచే అవగాహన కల్పించాలని సూచించింది. లబ్ధిదారుల కుటుంబాలకు యూనిట్పై పూర్తి అవగాహన కలిగి, పూర్తిస్థాయిలో నడిపించేందుకు సిద్ధమైనట్లు కలెక్టర్, రిసోర్స్ బృందం సంతృప్తి చెందితే యూనిట్ ను వారికి అందించాలని స్పష్టం చేసింది.
మంజూరు అనంతరం కూడా యూనిట్ల నిర్వహణో రిసోర్స్ బృందాలు లబ్ధిదారులకు తగిన సహకారం అందించాల్సి ఉంటుంది. యూనిట్లన్నీ మంజూరై పూర్తిస్థాయిలో నడిచేలా ప్రతిదశలోనూ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్, బృందాలకు ప్రభుత్వం ఆదేశించింది. పైలట్ ప్రాజెక్టు ప్రస్తుతం దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.