అర్చకులకు గుడ్ న్యూస్..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ.. అక్కడి వాతావరణం హీటెక్కుతోంది. అక్టోబర్/నవంబర్లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని అధికార భారత్ రాష్ట్ర సమితి కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. చకచకా వాటిని అమలు చేస్తోంది. గతంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కటొక్కటిగా వాస్తవ రూపాన్ని దాల్చుతోన్నాయి.
హైదరాబాద్ శివార్లల్లోని గోపనపల్లి వద్ద నిర్మించిన బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించిన సమయంలో అర్చకులకు కేసీఆర్ కీలక హామీ ఇచ్చారు. వేద పండితులకు మంజూరు చేస్తోన్న నెలవారీ గౌరవ వేతనాన్ని 2,500 నుంచి 5,000 రూపాయల వరకు పెంచుతున్నామని, ఈ పథకం కింద లబ్ధిదారుల అర్హత వయస్సు 75 నుంచి 65 సంవత్సరాలకు కుదిస్తామని కేసీఆర్ అప్పట్లో వెల్లడించారు.

రాష్ట్రంలో ఉన్న 3,645 దేవాలయాలకు ధూప, దీప నైవేద్యం కింద అందిస్తోన్న 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయలకు పెంచుతామనీ కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ పథకం కింద మరిన్ని ఆలయాలను చేర్చుతామని, దీని పరిధిలోకి 6,441 దేవాలయాలను తీసుకొస్తామని చెప్పారు.
ఇప్పుడా హామీలు కార్యరూపం దాల్చాయి. ధూప దీప నైవేద్య పథకం కింద మంజూరు చేస్తోన్న ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం భారీగా పెంచింది. ప్రతి నెలా అర్చకులకు ఇస్తోన్న గౌరవ వేతనం మొత్తాన్ని 6,000 నుంచి 10,000 రూపాయలకు పెంచింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే జీఓ నంబర్ 128ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల 4,800 మంది అర్చకులకు లబ్ది కలుగుతుంది.
ఈ 10,000 రూపాయల మొత్తంలో 6,000 రూపాయలు అర్చకుల గౌరవ వేతనంగా వెళ్తుంది. మిగిలిన 4,000 రూపాయలను ధూప దీప నైవేద్యం కింద ఖర్చుల కోసం వినియోగించాల్సి ఉంటుంది. గతంలో ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతినెలా 6,000 రూపాయలను చెల్లిస్తుండేది. అందులో 4,000 రూపాయలు అర్చకులకు గౌరవ వేతనం కాగా.. మిగిలిన మొత్తం ధూప దీప నైవేద్యం ఖర్చుల కోసం వ్యయం చేసేవారు.












Click it and Unblock the Notifications