కోవిడ్ వ్యాక్సినేషన్ కు తెలంగాణా సర్కార్ యాక్షన్ ప్లాన్ ..జనవరి 15 నుండి ..రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు, శిక్షణ
కరోనా మహమ్మారి నుండి ప్రపంచం బయటపడే మార్గాలను అన్వేషిస్తుంది . కరోనా నుండి కాపాడుకోవడం కోసం యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లు తయారుచేసి ప్రజలకు వ్యాక్సినేషన్ నిర్వహించటానికి ప్రపంచ వ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక భారత దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసి, త్వరలో మార్కెట్లోకి వ్యాక్సిన్ ను విడుదల చేయనున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్రం వ్యాక్సినేషన్ కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించింది . వచ్చే నెల నుండి రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ జరగనున్న కారణంగా, తెలంగాణా ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ కు సిద్ధం అవుతోంది.
Recommended Video

తెలంగాణా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు
కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చినవెంటనే కరోనా వ్యాక్సినేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. వ్యాక్సినేషన్ కు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జనవరి 15వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 2.7 లక్షల వైద్య సిబ్బందికి మొదటి ప్రాధాన్యత గా కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వనున్నట్లు గా పేర్కొంది. డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీలకు మొదట కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లుగా పేర్కొంది.

జనవరి రెండో వారం నుండి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇస్తామన్న పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు
రాష్ట్రంలో జనవరి రెండో వారం నుండి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం ముందుగా స్థానికంగా ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు . వ్యాక్సిన్ పంపిణీ పూర్తిగా ఎలక్షన్ విధానంలో జరుగుతుందని స్పష్టం చేసిన ఆయన, టీకా తీసుకోదలచుకున్న అభ్యర్థులు ఐడి కార్డులు లేదా ఆధార్ కార్డు తో రావాల్సి ఉంటుందని ఐడి కార్డులు పరిశీలించిన తరువాతనే అభ్యర్థులకు ఒక ఎస్ఎంఎస్ వస్తుందని ఆ తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం కూడా జరుగుతుందని పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్.. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు
వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు గా పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ సెంటర్లను కూడా ఎంచుకుని డిసెంబర్ 22 వరకు వ్యాక్సినేషన్ ఇచ్చే సిబ్బందికి తర్ఫీదు ఇవ్వనున్నట్లు గా స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా వారి ఆరోగ్య వివరాలను అధికార యంత్రాంగం తెలుసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ లో భాగంగా మండల, జిల్లా ,రాష్ట్ర స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

వ్యాక్సిన్ పంపిణీపై అధికారులకు వర్చువల్ శిక్షణ
వ్యాక్సిన్ పంపిణీపై అధికారులకు వర్చువల్ శిక్షణ ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రణాళిక, వ్యాక్సినేషన్ నిలువ తదితర విషయాలపై వారికి తర్ఫీదు ఇస్తున్నారు. కరోనా టీకా తీసుకున్న తర్వాత పర్యవేక్షణ, ప్రజల ఆందోళన తగ్గించడం , కరోనా వ్యాక్సిన్ గురించి ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కోటి మందికి టీకా ఇవ్వటానికి కావాల్సిన మౌలిక వసతులు సిద్ధం చేసుకుంటూ ముప్పై రోజుల ప్రణాళికతో ముందుకు వెళ్తుంటే తెలంగాణా ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ ఏర్పాట్లు చేస్తోంది .












Click it and Unblock the Notifications