గవర్నర్ లక్ష్యంగా - సంచలన నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం..!?
తెలంగాణలో గవర్నర్ - ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరుగుతోంది. గవర్నర్ ఓపెన్ గానే ప్రభుత్వ తీరు పైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ నేతల నుంచి కౌంటర్ చేస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సమావేశాల వేదికగా కేంద్రం తీరును ప్రజలకు వివరించటంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టం వివరించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో గవర్నర్ అధికారాలకు రాష్ట్రంలో కోత విధించే అవకాశాల పరిశీలన జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాల పైక కసరత్తు పూర్తి చేసి అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకొనేందుకు రంగం సిద్దం అవుతోంది.

మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు..
ఈ నెల మూడో వారంలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. అయిదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్రం వర్సస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్లు గా పరిస్థితి మారింది. రాజకీయంగా బీజేపీ - టీఆర్ఎస్ మధ్య యుద్దం పతాక స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు..రాష్ట్రాల పైన ఆర్దిక ఆంక్షల కారణంగా తెలంగాణ ఎంత మేర నష్ట పోయిందీ వివరించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దం అవుతోంది.
అందులో భాగంగా..రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా..కేంద్రం సెస్సుల అంశం పైన అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన బాధ్యతలను మంత్రి హరీష్ కు సీఎం కేసీఆర్ అప్పగించారు. ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ..కేంద్రం తెలంగాణకు నష్టం చేస్తందనే అంశాన్ని పూర్తి ఆధారాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.

గవర్నర్ అధికారాలకు కోత..?
తెలంగాణ గవర్నర్ అధికారాలకు కోత పెట్టే అంశం పైన ప్రస్తుతం పరిశీలన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. యూనివర్సిటీల ఛాన్సలర్ గా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ గవర్నర్ కు ఈ హోదాలో కొనసాగుతున్నారు. ఇప్పుడు వర్సిటీ ఛాన్సలర్ గా గవర్నర్ తొలిగింపు అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం కేరళ ప్రభుత్వం ఇదే తరహాలో అక్కడి గవర్నర్ కు ఒక యూనివర్సిటీ ఛాన్సలర్ హోదా నుంచి తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. న్యాయ స్థానాల వరకు వెళ్లింది. ఇప్పుడు అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుంటూనే తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
తమ నిర్ణయానికి సాంకేతికంగా- న్యాయ పరంగా ఇబ్బందులు లేవనే నిర్ణయానికి వస్తే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే వర్సిటీల ఛాన్సలర్ గా గవర్నర్ కు బాధ్యతలను తొలిగిస్తూ నిర్ణయం తీసుకొనే విధంగా బిల్లు ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది.

సభా వేదికగా కీలక తీర్మానాలు..
కేంద్రం తీసుకుంటున్న కొన్నినిర్ణయాలను తప్పు బడుతున్న తెలంగాణ ప్రభుత్వం వాటిని అసెంబ్లీ వేదికగా చర్చించాలని భావిస్తోంది. తెలంగాణను కేంద్రం ఉద్దేశ పూర్వకంగానే ఆర్దికంగా అష్ట దిగ్బంధనం చేసిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అదే విధంగా ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించటంతో రాజకీయంగానూ ఈ సమావేశాలు తెలంగాణ ప్రభుత్వానికి కీలకంగా మారనున్నాయి.
ఈ నెల, జనవరి మాసంలో పలు కీలక పథకాల అమలు దిశగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా కీలకంగా మారుతున్నాయి. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఎటువంటి తీర్మానాలు చేస్తుందీ.. ఏ నిర్ణయాలు తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications