తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం: ఇక మాస్కు మస్ట్, పండగలపై ఆంక్షలు
హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాల్లో మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం , ఐపీసీ కింద చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ర్యాలీలు, ఒకే చోట ప్రజలు గుంపులుగా ఉండటంపై ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 30 వరకు ఎలాంటి ర్యాలీలు, ఉత్సవాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాలు, స్థలాలు, పార్కుల్లో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని పేర్కొంది.
హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రై డే, రంజాన్ తదితర మతపరమైన కార్యక్రమాలను నిర్వహించరాదని తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిబంధనలు విధిగా అమలు చేయాలని రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.
పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,05,804 కు చేరింది . ఇందులో 2,99,878 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందినట్లుగా సమాచారం. దీంతో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1685కు చేరుకుంది. కరోనా బారినుండి నిన్న ఒక్కరోజే 247 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,241 యాక్టివ్ కేసులున్నాయి.