రాహుల్ యాత్ర: కదిలిన కెసిఆర్ ప్రభుత్వం (పిక్చర్స్)
హైదరాబాద్: కాంగ్రెసు యువరాజు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లా పర్యటన తెలంగాణ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టినట్లే కనిపిస్తోంది. రాహుల్ గాంధీ పర్యటన వల్ల తెలంగాణలోని రైతుల ఆత్మహత్య సమస్య జాతీయ స్తాయిలో చర్చనీయాంశంగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీ శుక్రవారంనాడు పరామర్శించడంతో పాటు సాయంత్రం జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కూడా లక్ష్యం చేసుకుని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల జాబితాను తయారు చేసి, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే చర్యలకు శ్రీకారం చుట్టింది. జూన్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వేయి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెసు నాయకులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల జాబితాను పంపించడంలో జిల్లాల కలెక్టర్లు తీవ్రమైన జాప్యం చేశఆరు.
2014 అక్టోబర్ నుంచి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల జాబితాను పంపించాలని తెలంగాణ ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లను అడిగింది. కానీ వారు జాబితాను తయారు చేసి పంపించలేకపోయారు. ఇప్పటి వరకు 92 మంది రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వం చెబుతుండగా ఆ సంఖ్య 900 దాకా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి, అక్టోబర్ 2014లోనే ముఖ్యమంత్రి, మంత్రులు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి, ఆర్ధిక సాయం అందించాలని అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

జాప్యమే రాహుల్ గాంధీకి అవకాశం
ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు జిల్లాల్లో పర్యటించి, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడంలో చేసిన జాప్యం కారణంగానే రాహుల్ గాంధీకి అవకాశం లభించిందని అంటున్నారు.

కెసిఆర్పై వ్యంగ్యాస్త్రాలు
ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కెసిఆర్ను మినీ మోడీగా అభివర్ణించారు.

ఆర్థిక సాయం పెంపు
ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు లక్షన్నర రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వాలు అందిస్తూ వచ్చాయి. దాన్ని 2 లక్షల రూపాయలకు పెంచాలని కెసిఆర్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

తీరిక లేదా...
రైతులను పట్టించుకునే తీరిక ఢిల్లీలో మోడీకి, ఇక్కడి మినీ మోడీకి లేకుండా పోయిందని రాహుల్ గాంధీ విమర్శించారు. రైతులను తాము ఆదుకుంటామని, వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పారు.

రాహుల్ గాంధీ జోష్
కాంగ్రెసు యువరాజు రాహుల్ గాంధీ తన వాచకాన్ని, వక్తృత్వ శైలిని మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. తన ప్రసంగంలో పంచ్లు ఉండేలా చూసుకుంటున్నారు. ఆ పంచ్లతోనే కెసిఆర్ను, మోడీని విమర్శించారు.












Click it and Unblock the Notifications