విద్యార్థుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కొత్త పథకం
రేవంత్ రెడ్డి సర్కారు త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనుంది. అధికారంలోకి వచ్చినప్పుడే ప్రస్తుత ప్రభుత్వం దీనిపై లోతుగా సమీక్ష జరిపింది. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వేర్వేరుగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసింది. అయితే వీటన్నింటినీ ఇప్పుడు ఒకే ప్రాంగణంలోకి తీసుకురాబోతోంది ప్రస్తుత ప్రభుత్వం.
సిద్ధమైన డిజైన్ల పరిశీలన
దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతోపాటు పలువురు మంత్రులు చర్చించారు. విశాలమైన ప్రాంగణంలో ఒకేచోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహించడంలో ఉన్న అనుకూల, ప్రతికూల పరిణామాలపై సమీక్ష జరిగింది. వీటికోసం కొత్తగా భవనాలను నిర్మించాల్సి ఉండగా, అన్నింటినీ ఒకేలా డిజైన్ చేయాలని అధికారులకు సీఎం సూచించారు. వాటి ప్రకారమే డిజైన్లు సిద్ధం చేయగా సీఎంతోపాటు డిప్యూటీ సీఎం, సీఎస్ శాంతికుమారి పరిశీలించారు. కొత్త పథకాన్ని ముందుగా కొడంగల్, మధిర అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.

20 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం
మొదటిగా ఈ రెండు నియోజకవర్గాల్లో పాఠశాలలు నిర్మించి తర్వాత దశలవారీగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మించనున్నారు. ఈ భవనాల కోసం ఇప్పటికే 20 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఆర్కిటెక్టుల నుంచి వచ్చిన డిజైన్లలో అత్యుత్తమంగా నిలిచినవాటిని ఎంపిక చేసి భవనాలు నిర్మిస్తారు. ఆచరణాత్మక సమస్యలపై అధ్యయనం చేసి తర్వాత మిగిలిన నియోజకవర్గాలకు విస్తరిస్తారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీలో ఉన్నారు. ఆయనతోపాటు మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండటంతో దీనిపై రేవంత్ అధిష్టానంతో చర్చించే అవకాశం కనపడుతోంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఖాయం అంటున్నారు.












Click it and Unblock the Notifications