తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రద్దు -ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా -కరోనా వ్యాప్తితో సీఎం కేసీఆర్ నిర్ణయం
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతుండటంతో కేంద్రంలోని మోదీ సర్కార్ సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన మరుసటి రోజే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10వ తరగతి (ఎస్సెస్సీ) పరీక్షలను రద్దు చేయడంతోపాటు ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది.
రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో కీలక సమీక్ష నిర్వహించారు. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, విద్యా శాఖ కమిషనర్, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్బీఐ) కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితర ఉన్నతాధికులు పాల్గొన్న సమావేశంలో చివరికి పది పరీక్షల రద్దుకే సీఎం మొగ్గుచూపారు.

''పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని, ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది'' అని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ మీడియాకు చెప్పారు. కాగా, పరీక్షల రద్దుకు సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం కూడా చేశారని, కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
తెలంగాణలో 2021 సంవత్సరానికి గానూ మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు, మే 1 నుంచి ఇంటర్మీడిట్ పరీక్షలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దుకాగా, ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రతి సంవత్సరం 5 లక్షలకు పైగా విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షలకు, సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరవుతారు.
ఏప్రిల్ 7 నుండి జరగాల్సిన ప్రాక్టికల్ పరీక్షలను ఇంటర్ బోర్డు ఇప్పటికే వాయిదా వేసింది. థియరీ పరీక్ష తర్వాత ఈ పరీక్షలను 2021 మే 29 నుంచి 2021 జూన్ 7 వరకు నిర్వహించాలని బోర్డు ముందే నిర్ణయించింది. ఫిజికల్ గా పరీక్షలకు హాజరయ్యే బదులు పీడీఎఫ్ ఆకృతిలో ఇంటి నుంచే పంపేలా, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే రెండు పేపర్లను సమర్పించాలని విద్యార్థులకు సూచనలు వెళ్లాయి.












Click it and Unblock the Notifications