తెలంగాణలో కరోనా శాంపిళ్ల సేకరణకు బ్రేక్: ఎందుకంటే..?, కరోనా కేసుల్లో టాప్-10లోకి
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నమూనాల సేకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే సేకరించిన నమూనాలను పరీక్షించని నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో శాంపిళ్లను సేకరించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ తోపాటు పొరుగు జిల్లాల్లో పది రోజుల్లో 50వేల పరీక్షలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
నమూనాల సేకరణకు తాత్కాలిక బ్రేకులు..
అయితే, ఆశించిన రీతిలో పరీక్షలు జరగడం లేదు. నమూనాలు సేకరించినా.. పరీక్షలకు సమయం పడుతుండటంతో నమూనాల సేకరణ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు వేసింది. అయితే శిబిరాల్లో నమూనాల సేకరణ మాత్రమే నిలిపివేశామని, కరోనా పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో 50వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలోనే జూన్ 16 వరకు రాష్ట్రంలో 44,341 పరీక్షలు చేయగా, 5406 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూన్ 24 నాటికి 67,318 టెస్టులు చేయగా..10,444 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.
లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన సర్కారు..
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రైవేటు ల్యాబ్ల్లో కూడా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా నిర్ధారణ పరీక్షకు రూ. 2200 మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్ల్లో కరోనా పరీక్షలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు బుధవారం గరిష్టంగా 4069 కరోనా పరీక్షలు చేశారు. టెస్టులు ఆశించిన వేగంగా జరగకపోవడంతో పది రోజుల్లో 50వేల పరీక్షలు చేయాలని నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోలేకపోయింది. రోజుకు 5వేల కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్న కోబాస్ 8800 మెషీన్ను సీఎస్ఆర్ కింద తెలంగాణ కోసం ఆర్డర్ చేయగా.. దాన్ని కోల్ కతాకు తరలించారనే ఆరోపణలున్నాయి. ఆశించిన స్థాయిలో కరోనా పరీక్షలు జరగకపోవడానికి ఇది కూడా ఒక కారణంగా ప్రభుత్వం చెబుతోంది.
Recommended Video
టాప్-10లోకి...
కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 10,444 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5858 యాక్టివ్ కేసులున్నాయి. 4361 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 225 మంది కరోనాతో మరణించారు. వరుసగా ఎక్కువ కరోనా కేసులు నమోదువుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణలో టాప్ 10 లో చేరిపోవడం గమనార్హం.