తల్లిదండ్రులకు తీపికబురు.. ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్ వరకు ఒకేచోట ఉచితవిద్య!
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విద్యకు చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. తాజాగా రాష్ట్రంలోని చిన్నారుల కోసం రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 97 కొత్త తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (TPS) నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలలు ఒకే క్యాంపస్లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని తరగతులు ఒకే చోట అందించడం లక్ష్యంగా ముందుకు వచ్చాయి.
తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల భావన వెనుక
ప్రధానంగా పట్టణ ప్రాంతాల వెలుపల ప్రాంతాల్లో ఈ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధి వెలుపల ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటికి ఒక TPS యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాధారణ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల భావనను మరింత విస్తృతం చేస్తున్నారు.

ఏకీకృత క్యాంపస్ ల ద్వారా ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్ వరకు
ఏకీకృత క్యాంపస్ ల ద్వారా నర్సరీ (ప్రీ-ప్రైమరీ) నుంచి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు ఒకే క్యాంపస్లో ఇంగ్లీష్ మీడియం విద్య అందించనున్నారు. సెమీ-రెసిడెన్షియల్ వ్యవస్థ తో ఇంటి వాతావరణంలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో సెమీ-రెసిడెన్షియల్ పద్ధతిలో నడపనున్నారు. అంతేకాదు పూర్తిగా ఉచిత విద్య, గ్రామీణ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, విద్యార్థులకు పోషకాహార భోజనం, ప్రాథమిక మౌలిక వసతులు ఈ పాఠశాలలో కల్పించనున్నారు.
1,500 మంది విద్యార్థుల సామర్థ్యంతో మెగా క్యాంపస్లు
ప్రతి పాఠశాల నిర్మాణానికి సుమారు 10 కోట్లు అంచనా వ్యయంతో, 4 నుంచి 6 ఎకరాల స్థలంలో సుమారు 1,500 మంది విద్యార్థుల సామర్థ్యంతో మెగా క్యాంపస్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న భవనాలను అభివృద్ధి చేసి లేదా కొత్తవి నిర్మించి భారీ క్యాంపస్లుగా మార్చనున్నారు.ప్రతి మండలంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను TPSలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నాలుగు పైలట్ ప్రాజెక్ట్ స్కూళ్లకు రూ. 56.69 కోట్లు
రంగారెడ్డి జిల్లాలోని మంచాల, ఆరుట్ల మరియు నాగర్కర్నూల్ జిల్లాలోని వంగూర్, పోల్కం పల్లిలో పైలట్ పాఠశాలలు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ నాలుగు పైలట్ స్కూళ్లకు రూ. 56.69 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 13న మొదటి అప్గ్రేడెడ్ పాఠశాలను ప్రారంభించనున్నారు. ఆరుట్ల లోని పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
ప్రైవేట్ స్కూల్స్ పై ఆధారకుండా ఉచిత నాణ్యమైన విద్య
ఈ ప్రతిపాదన ద్వారా ప్రైవేట్ స్కూళ్లపై ఆధారపడకుండా, మధ్యతరగతి మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన, సులభంగా అందుబాటులో ఉండే విద్య అందించడం లక్ష్యంగా పనిచేయనున్నారు . అకాడెమిక్స్తో పాటు క్రీడలు, నైపుణ్యాల అభివృద్ధి కోసం ఒకే చోట అత్యాధునిక వసతులు కల్పించడం ద్వారా సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించనున్నారు.













Click it and Unblock the Notifications