ఎట్టకేలకు ఆ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్... కానీ సర్కార్ ఆస్పత్రులకే పరిమితం...
తెలంగాణలో కరోనా చికిత్సను ఎట్టకేలకు ఆరోగ్యశ్రీలో చేర్చింది ప్రభుత్వం. అయితే తొలి దశలో దీన్ని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేసింది. రెండో దశలో ప్రైవేట్ ఆస్పత్రులకు వర్తింపజేయనుంది. కరోనా వల్ల సంక్రమించే మొత్తం 15 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చికిత్స అందించనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్ పీక్స్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు,ప్రజలు ఎంత డిమాండ్ చేసినా ఈ విషయాన్ని పట్టించుకోని ప్రభుత్వం...కరోనా ఉధృతి తగ్గాక దాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం గమనార్హం.

ఆయుష్మాన్ భారత్తో కలిపి అమలు...
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలుచేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ భారత్తో కలిపి ఆరోగ్యశ్రీని అమలుచేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.5లక్షలు వరకు,ఆరోగ్యశ్రీ ద్వారా రూ.2లక్షలు వరకు కవరేజీ ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం ఆయా ఆస్పత్రులకు నేరుగా అందజేయనుంది. వైరస్లతో సంక్రమించే అన్ని రకాల వ్యాధులు.. అలాగే స్వైన్ఫ్లూ వైద్యాన్ని కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చింది.

చివరి నిమిషంలో నిర్ణయం మార్పు?
నిజానికి ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకురావాలని భావించిన ప్రభుత్వం... చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుందనే ప్రచారం జరుగుతోంది. కరోనా చికిత్సను కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆరోగ్యశ్రీ అనగానే అందరికీ గుర్తొచ్చేది కార్పోరేట్ వైద్యం. స్తోమత లేని పేదలు దీని ద్వారా కార్పోరేట్ వైద్యం పొందే వెసులుబాటు కలుగుతుంది. అలాంటిది ప్రభుత్వం దీన్ని సర్కార్ ఆస్పత్రులకు పరిమితం చేయడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఏయే వ్యాధులకు...
నిమోనియా
అక్యూట్ ఫెబ్రిలి ఇల్నెస్ (జ్వరంతో కలిగే అనారోగ్యం)
పైరిక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్(నిర్దారణ కాని జ్వరం)
అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు వచ్చే నిమోనియా (నాన్ వెంటిలేటెడ్)
అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వచ్చే నిమోనియా (వెంటిలేటెడ్)
ఏ అనారోగ్య కారణంతో శ్వాస ఆగిపోయే పరిస్థితి (నాన్ వెంటిలేటెడ్)
ఏ అనారోగ్య కారణంతో శ్వాస ఆగిపోయే పరిస్థితి (వెంటిలేటెడ్)
స్వైన్ఫ్లూ నిమోనియా
స్వైన్ఫ్లూ తీవ్రమై అవయవాలు దెబ్బతినడం
స్వైన్ఫ్లూ సోకి తీవ్రమైన రక్తస్రావం జరగడం
శ్వాసనాళాల ఇన్ఫెక్షన్ (వెంటిలేటెడ్)
శ్వాసనాళాల్లో తీవ్రమైన నిమ్ము (వెంటిలేటెడ్)
స్వైన్ఫ్లూతో తీవ్రమైన రక్తస్రావం,నిమ్ము ఏర్పడటం
ఊపిరితిత్తుల్లో శ్వాసకోశాలు చిట్లిపోవడం
నిమోకోనియోసిస్

ప్యాకేజీల వారీగా...
కరోనా కారణంగా సంక్రమించే పలు రకాల వ్యాధుల చికిత్సకు.. వాటిని ప్యాకేజీల వారీగా విభజించింది. వాటిలో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, పల్మనాలజీ, క్రిటికల్ కేర్ కేటగిరీలు ఉన్నాయి. ఆ ప్రకారమే ఆస్పత్రులకు ప్యాకేజీలు అందజేస్తారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్గున్యా తదితర వైరల్ ఫీవర్లకు,వైరస్ల కారణంగా సంక్రమించే వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించనుంది.ఆరోగ్యశ్రీ కింద మొత్తం 84లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 26 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు.

అప్పుడు పట్టించుకోని ప్రభుత్వం..
కరోనా వేళ ప్రైవేట్ ఆస్పత్రులు సామాన్యులను విపరీతంగా దోచుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చితే కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడీకి చెక్ పెట్టినట్లవుతుందని ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. అందరూ ఆరోగ్యశ్రీ గురించి డిమాండ్ చేస్తున్న సమయంలో ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ను తెర పైకి తీసుకొచ్చింది. ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరేందుకు మొదటి నుంచి విముఖత చూపిస్తూ వచ్చిన ప్రభుత్వం... ఆరోగ్యశ్రీ విషయంలో అన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చేసరికి అందులో చేరాలని నిర్ణయించింది.

సీతక్క దీక్ష చేసినా...
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఆమె దీక్ష చేపట్టారు. ఆరోగ్యశ్రీ కింద కరోనా వైద్యం అందించడంతో పాటు ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని, కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి వాళ్ళు ఆస్పత్రుల్లో కట్టిన బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తిరిగి వారికి చెల్లించాలని సీతక్క డిమాండ్ చేశారు.అసలే కరోనా కారణంగా ఉద్యోగ,ఉపాధి కోల్పోయిన వేళ కార్పోరేట్ ఆస్పత్రులకు లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేమని... దయచేసి ఆ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎంతోమంది సామాన్యులు సైతం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో దీనిపై ఉద్యమం కూడా నడిపారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ డిమాండును పట్టించుకోలేదు.
ఫలితంగా ఎన్నో కుటుంబాలు ఆస్తులమ్మి మరీ కార్పోరేట్ ఆస్పత్రులకు ఫీజులు కట్టారు. కొన్ని ఆస్పత్రులు ఏకంగా రూ.30లక్షలు వరకు వసూలు చేశాయి. కరోనా వేళ సామాన్యులను కార్పోరేట్ ఆస్పత్రులు అందినకాడికి దోచుకున్నాయనే ఆరోపణలున్నాయి.
Recommended Video

కేసీఆరే స్వయంగా ప్రకటించినా...
కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని గతంలో సీఎం కేసీఆరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేస్తామన్నారు. వాటికి సంబంధించిన బిల్లులుంటే తనకు పంపాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు పటిష్టంగా ఉందన్నారు. ఆరోగ్యశ్రీని, 108ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చారని.. ఆ పథకాలు బాగున్నందువల్లే తాము వాటి పేరును కూడా మార్చకుండా అలాగే కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.రోగుల పట్ల కార్పొరేట్ ఆస్పత్రులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయన్నారు.ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీనే మెరుగైన పథకమని చెప్పిన కేసీఆర్... ఆశ్చర్యంగా ఆరోగ్యశ్రీని పక్కనపెట్టి ఆయుష్మాన్ భారత్నే తీసుకొచ్చారు. ఎట్టకేలకు ఇన్ని నెలల తర్వాత కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications