తెలంగాణలో లాక్డౌన్ మార్గదర్శకాలు ఇవే... వాటికి మినహాయింపు... ఆర్టీసీ బస్సులు ఆ టైమ్ వరకే...
తెలంగాణలో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... తాజాగా దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్డౌన్ పీరియడ్లో వేటికి మినహాయింపు ఉంటుంది... వేటికి మినహాయింపు ఉండదు వంటి అంశాలపై స్పష్టతనిచ్చింది. రవాణా సౌకర్యాలు,ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ,ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే...:
లాక్డౌన్ పీరియడ్లో ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకే ఆర్టీసీ బస్సు సర్వీసులు,మెట్రో సర్వీసులు
ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ఉండవు
జాతీయ రహదారులపై యథావిధిగా రవాణా
33శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ
ఏటీఎంలు,బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి
వ్యవసాయ రంగానికి లాక్డౌన్ నుంచి పూర్తి మినహాయింపు
గ్రామాల్లో యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు,ఉపాధి హామీ పనులు
తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు
ఫార్మా రంగం,మెడికల్ షాపుల్లో పనిచేసేవారికి,ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పాసుల జారీ
సినిమా హాళ్లు,జిమ్స్,క్రీడా మైదానాలు,స్విమ్మింగ్ పూల్స్ మూసివేత
పెళ్లిళ్లకు 40 మంది,అంత్యక్రియలకు 20 మంది హాజరయ్యేందుకు అనుమతి
వైద్యరంగం,విద్యుత్,మీడియా,కోల్డ్ స్టోరేజీలు,గోడౌన్లు,వంటగ్యాస్,పెట్రోల్ బంకులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు
దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వం కూడా లాక్డౌన్ నిర్ణయం తీసుకోక తప్పలేదు. 10 రోజుల తర్వాత అప్పటి పరిస్థితులపై సమీక్ష జరిపి లాక్డౌన్ కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అప్పటివరకూ ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
Recommended Video
మరోవైపు కేవలం 24 గంటల సమయం ఇచ్చి లాక్డౌన్ విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు కూడా ఈ విషయంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటి నుంచి లాక్డౌన్ కావడంతో నగరాలను వీడేవారు ఇప్పటికే స్వగ్రామాలకు బయలుదేరారు. ముఖ్యంగా రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవారు లాక్డౌన్ కారణంగా మళ్లీ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు.దీంతో నగరంలోని రోడ్లన్నీ ఒక్కసారిగా రద్దీగా మారిపోయాయి.