ఓటుకు నోటు: ఏసీబీ ఖర్చు, 15 రోజుల్లో 37 లక్షలు...?
హైదరాబాద్: ‘ఓటుకు నోటు' కేసు తెలంగాణ దర్యాప్తు అధికారులకు పెను భారంగా మారిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని సృష్టించిన ఓటుకు నోటు వ్వవహారాన్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో ఒక ముఖ్యమంత్రిపై ఆరోపణలు రావడంతో ఈ కేసును ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సాధారణ ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో అదనపు నిధులకోసం ఏసీబీ అధికారులు ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. సర్కార్కు వినతి పంపించి అదనపు నిధులు సేకరిస్తున్నారు.
సాధారణంగా ఆయా శాఖల అవసరాన్ని బట్టి అదనపు నిధులను ప్రభుత్వం మంజారు చేస్తూ ఉంటుంది. అయితే ఈ కేసు వ్యవహారంలో ఏసీబీకి అదనపు నిధులు విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్సింహరూ. 50 లక్షలు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ ఏసీబీ అధికారులు మే 31న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

స్టీఫెసన్సన్ ఫిర్యాదు చేసిన తర్వాత, రేవంత్రెడ్డి, సహ నిందితులను అరెస్టు చేసేందుకు ఏసీబీ అధికారులు టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకున్నారు. టెక్నాలజీకి ఖర్చుపెట్టిన దానితోపాటు ఇతరత్రా ఖర్చులు పెరిగిపోవడంతో అదనపు నిధులు కేటాయించాలని కోరుతూ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
దీంతో 15 రోజుల్లో రెండు దఫాలుగా ప్రభుత్వం రూ.37 లక్షల అదనపు నిధులు విడుదల చేసింది. ఈ నెల 6న రూ.12 లక్షలు మొదటి విడతలో విడుదలకాగా, సోమవారం రెండో దఫాగా రూ. 25 లక్షలు విడుదలయ్యాయి. సాధారణ కేసుల మాదిరిగా కాకుండా ఓటుకు నోటు కేసును ఒక ‘ఆపరేషన్' స్థాయిలో చేపట్టడంవల్లే ఆర్థికభారం వచ్చిపడిందని అంటున్నారు.
అయితే ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదని సాధారణంగానే ప్రభుత్వం నుంచి అధనపు నిధులు అడిగి తీసుకుంటున్నామని ఏసీబీ అధికారులు మరో మాటగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications