లోకసభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన, వెల్లోకి కవిత: సభ వాయిదా
న్యూఢిల్లీ: లోక్సభలో బుధవారం టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు ఆందోళన చేపట్టారు. విభజన జరిగి మూడేళ్ల దాటినా హైకోర్టును కేంద్రం ఎందుకు విభజించడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపీలు సభ ప్రారంభమైన వెంటనే 'వీ వాంట్ హైకోర్టు' అంటూ నినాదాలు చేశారు.
స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించగా ఆందోళన చేపట్టి అడ్డుకున్నారు. టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత జితేందర్రెడ్డి తన స్థానంలోనే లేచి నిలబడి ఆందోళన చేపట్టగా.. కవిత వెల్లోకి వెళ్లి ఆందోళన చేశారు. గందరగోళం మధ్య లోక్సభ వాయిదా పడింది.

సభ వాయిదా అనంతరం ఎంపీ జితేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'మూడేన్నరేళ్లు గడుస్తున్నా హైకోర్టు విభజన జరగడం లేదు. ఇంతకుముందు ఏర్పడిన రాష్ట్రాల్లో కోర్టుల విభజన వెంటనే జరిగింది. తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ఎన్నిసార్లు ఈ సమస్యను లేవనెత్తినా న్యాయం జరగడం లేదు' ఆని ఆవేదన వ్యక్తం చేశారు.
హైకోర్టును విభజించకపోవడం వల్ల తెలంగాణకు నష్టం కలుగుతోందన్నారు. ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో తెలంగాణ వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. చట్టసభల వేదికగా గతంలో కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, సదానంద గౌడ, వెంకయ్యనాయుడు హైకోర్టు విభజనపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఇప్పటికీ హామీలు అమలు కావడం లేదన్నారు. హైకోర్టు విభజనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు. ఏపీ హైకోర్టుకు ల్యాండ్, భవనం కూడా ఇస్తామని కేసీఆర్ చెప్పినప్పటికీ ఆలస్యం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. హైకోర్టును విభజించకపోవడానికి గల రహస్యమేంటో చెప్పాలని ఎంపీ జితేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. హైకోర్టు విభజనపై హామీలు కాదు.. స్పష్టమైన ప్రకటన రావాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. కాగా, కర్ణాటక బీజేపీ నేత హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు, కులభూషణ్ జాదవ్కు అవమానం అంశాలపై సభలో ఇతర సభ్యులు ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications