తెలంగాణలో అదుపులోనే కరోనా-సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదు-బయట తిరుగుతున్న కొంతమంది కోవిడ్ పేషెంట్లు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్పై ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్ను నిర్లక్ష్యం చేస్తే మరో ముప్పు తప్పదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న కరోనా పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని... అయితే కొంతమంది కోవిడ్ పేషెంట్లు ఇష్టారీతిన బయట తిరుగుతున్నారని చెప్పారు. ఈ కారణం వల్లే కొన్నిచోట్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. థర్డ్ వేవ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.

సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదు..
సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదని... ఖమ్మం,కరీంనగర్,నల్గొండ జిల్లాల్లో కేసులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో ఒకేసారి భారీగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో వ్యాక్సిన్ వేసుకున్నవారినే హోటల్స్,మాల్స్లోకి అనుమతించే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ రెండు డెల్టా వేరియంట్ కేసులు నమోదైనట్లు చెప్పారు. మే నెలలోనే ఈ కేసులను హైదరాబాద్లో గుర్తించామన్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు పేషెంట్లు కోలుకుంటున్నారని... వారి కాంటాక్టులను గుర్తించి పరీక్షలు చేయగా నెగటివ్గా తేలిందన్నారు.మిగతా వేరియంట్స్తో పోలిస్తే డెల్టా వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు.

ఇప్పటివరకూ ఎంతమందికి వ్యాక్సిన్...
రాష్ట్రంలో 2.2కోట్ల మంది ప్రజలు వ్యాక్సిన్కు అర్హులైనవారు ఉండగా... వారిలో ఇప్పటివరకూ 1.12 కోట్ల మందికి సింగిల్ డోసు,33.79లక్షల మందికి సెకండ్ డోసు ఇచ్చామన్నారు. తొలి డోసు తీసుకున్నవారిలో 30శాతం మందికి రెండో డోసు ఇచ్చామన్నారు. 22.32 లక్షల మందికి కోవీషీల్డ్ రెండో డోసు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకూ 12 లక్షల మందికి ఇచ్చినట్లు తెలిపారు. మరో 3లక్షల మందికి కోవాగ్జిన్ రెండో డోసు ఇవ్వాల్సి ఉందన్నారు.

థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధం...
కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. తగినంతమంది ఆక్సిజన్,వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 26వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. 100 పడకలు ఉన్న అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ అగస్టు నెలాఖరు నాటికి ఆక్సిజన్ ప్లాంట్స్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ యాజమాన్యాలకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications