ఆరెంజ్ అలర్ట్: వచ్చే 4 రోజులు చాలా డేంజర్!
తెలుగు రాష్ట్రాలను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు సెగలు గక్కుతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో వడగాలులు (Heat Waves) వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణవ్యాప్తంగా ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ కీలక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్గిరి మరియు హైదరాబాద్ జిల్లాల్లో ఎండలు దంచికొట్టనున్నాయి. ఈ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉంది. నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది.
రానున్న 72 గంటల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల వరకు పెరగవచ్చు.

ఆంధ్రప్రదేశ్లో వడగాలుల ముప్పు..
ఆంధ్రప్రదేశ్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఏకంగా 275 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.పల్నాడు (44.5), కడప (44.1), మార్కాపురం (44) ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. రాయలసీమలో రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు ఒకటి రెండు చోట్ల కురిసినా.. వాతావరణం మాత్రం వేడిగానే ఉంటుందని అధికారులు వెల్లడించారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
తీవ్రమైన ఎండలు, అసౌకర్యమైన వాతావరణం దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు, పండ్ల రసాలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు














Click it and Unblock the Notifications