లిక్కర్ షాపులే కరోనా సెంటర్లు! సినిమా థియేటర్లు, పబ్బులపై ఆంక్షలు: హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతించాలని, క్లబ్బులు, పబ్బులు, సినిమా థియేటర్లపై ఆంక్షలు విధించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వం గురువారం హైకోర్టుకు సమర్పించింది. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Recommended Video
కరోనా టెస్టులు భారీగా పెంచండి..
వందమంది ఉద్యోగులున్న ఆఫీసుల్లో తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేసులు భారీగా పెరుగుతున్న వేళ మాస్కులు ధరించని వారిపై ఎన్ని కేసులు నమోదు చేశారో కూడా తెలపాలని హైకోర్టు కోరింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ కరోనా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మద్యం షాపులే కరోనా కేంద్రాలుగా.. వారికీ పరీక్షలు చేయండి
అంతేగాక, మద్యం దుకాణాలు కరోనా కేంద్రాలుగా మారాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. మద్యం దుకాణాలు, పబ్లు, థియేటర్లలో రద్దీపై ఆందోళన వ్యక్తం చేసింది. మద్యం దుకాణాలు కరోనా వనరులుగా మారాయని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు చేయాలని సూచించింది. నిపుణులతో సలహా కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
కరోనా నిబంధనల ఉల్లంఘనలపై సుమారు 22వేల కేసులు నమోదు చేసినట్లు డీజీపీ నివేదికలో వెల్లడించారు. భౌతిక దూరం పాటించని వారిపై 2416 కేసులు, రోడ్లపై ఉమ్మివేసిన వారిపై 6 కేసులు నమోదు చేశామని తెలిపారు. అయితే, నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.
పాతబస్తీలో తనిఖీలు చేస్తే రెండ్రోజుల్లోనే లక్షమంది దొరుకుతారు
రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1.16 లక్షల మందికే జరిమానా? అని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. పాతబస్తీ ప్రాంతంలో రెండ్రోజులు తనిఖీ చేస్తే లక్ష మంది దొరుకుతారని వ్యాఖ్యానించింది. సీరో సర్వైలెన్స్ ఆరు వారాల్లో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. సీరో పరీక్షలు పూర్తయ్యాక నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కంటైన్మెంట్ జోన్లు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ ఏర్పాట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఏప్రిల్ 14లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది.