తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వారంతపు లాక్డౌన్..: సర్కారుకు డెడ్లైన్ విధించిన హైకోర్టు, వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసుల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
వారాంతపు లాక్డౌన్, నైట్ కర్ఫ్యూపై తేల్చండి..
కరోనా పరిస్థితులను ప్రభుత్వం అన్ని విధాలుగా పర్యవేక్షణ చేస్తోందని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఏజీ. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. పర్యవేక్షణ కాదు.. చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. కరోనాపై ప్రజలకు అన్నీ తెలిశాయి.. ప్రభుత్వానికే తెలియాలని వ్యాఖ్యానించింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది.
ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది..
ఎన్నికల ర్యాలీలు, వివాహాలు, అంత్యక్రియల్లో రద్దీ నియంత్రణపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? అని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజల్లో ప్రభుత్వం విశ్వాసం నింపలేకపోతోదని మండిపడింది. వార్డుల వారీగా అత్యవసర బృందాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారా? కుటుంబమంతా కరోనా బారినపడితే ఏ విధంగా సాయం చేస్తున్నారు? అని ప్రశ్నించింది.
మిగితాది మేమే చేస్తామంటూ తేల్చేసిన హైకోర్టు..
ఆర్టీపీసీఆర్ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 22లోగా అన్నివివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా, మూడు రోజులు సరిపోవని, మరింత సమయం కావాలని ఏజీ కోరగా.. మూడు రోజుల్లో మీరు చేయగలిగింది చేయండి.. మిగితాది మేము చేస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ తర్వాత తదుపరి విచారణను ఏప్రిల్ 23కి వాయిదా వేసింది. 23న జరిగే విచారణకు కూడా ఇప్పుడు హాజరైన వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డీహెచ్ శ్రీనివాసరావు హాజరుకావాలని స్పష్టం చేసింది.
Recommended Video
తెలంగాణ సర్కారుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
అంతకుముందు సోమవారం ఉదయం విచారణ సందర్భంగా కూడా ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీ తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఉండటం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కంటే పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు కీలక సూచనలు చేసింది. పబ్బులు, మద్యం షాపులపై కరోనా ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది.
అంతేగాక, వంద మందికిపైగా సిబ్బంది ఉన్న ప్రతీ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలని స్పష్టం చేసింది. కరోనా టెస్టులను భారీగా పెంచాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. లాక్డౌన్ లేకపోయినా.. కనీసం కంటైన్మెంట్ జోన్లు అయినా ఉండాలని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, దీని కోసం నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు? నిర్ణయాలు తీసుకుంటుందా? ఆదేశాలు ఇవ్వమంటారా? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.