హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్-ఆదివారం ఆరాటం ఎందుకు? వద్దన్నా కూల్చేస్తారా.?
హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ కోసమంటూ అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్న హైడ్రాకు ఇవాళ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
ఓ అక్రమ కట్టడానికి సంబంధించి గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా ఆదివారం కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను కూడా పట్టించుకోరా అని వర్చువల్ గా విచారణకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను నిలదీసింది.

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆదివారం సైతం కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని హైడ్రా కమిషర్ ను ప్రశ్నించింది. సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసర కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. న్యాయ సలహా తీసుకోరా అని ప్రశ్నించింది. ఇలా పనిచేస్తే ఇంటికెళ్తారని హెచ్చరించింది.
రాజకీయ నేతలు, బాసులు చెప్పినట్లు నిర్ణయాలు తీసుకోవద్దని హైడ్రా కమిషనర్ ను హెచ్చరించింది. ఇలా అయితే స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే కూల్చివేతలకు బాధ్యుడైన అమీన్ పూర్ ఎమ్మార్వోపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతకు ఎమ్మార్వో అడిగితే యంత్రాలు, సిబ్బందిని ఇచ్చామన్న హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలపైనా సీరియస్ అయింది. చార్మినార్ కూల్చివేస్తానంటే కూడా ఇచ్చేస్తారా అని అడిగింది. మధ్యలో ఆయన ఏదో చెప్పబోతే.. అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పాలని సూచించింది. ఆదివారం కూల్చివేతలు చేయడం హైకోర్టు తీర్పుకు విరుద్ధమని తెలియదా అని హైడ్రా కమిషనర్ ను ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications