నయీం కేసులో ట్వీస్ట్: మాజీ డిజిపికి క్లీన్ చిట్, తేల్చేసిన హోంశాఖ
నయీం కేసులో హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో తెలంగాణ హోం శాఖ పలు ఆరోపణలను ఇట్లే తేల్చేసింది. మాజీ డీజీపికు లంక్స్ ఉన్నట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
హైదరాబాద్: ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగస్టర్ నయీం కేసుకు సంబంధించిన తెలంగాణ హోం శాఖ కీలకమైన మలుపు ఇచ్చింది. పలు ఆరోపణలను తేల్చేసింది. సిపిఐ నాయకుడు నారాయణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై తెలంగాణ హోం శాఖ గురువారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.
నయీంతో మాజీ డిజిపికి సంబంధాలున్నట్లు ఏ విధమైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నయీం ద్వారా పోలీసు అధికారులు ప్రయోజనం పొందారనే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. నయీంతో రాజకీయ నాయకులకు, పోలీసులకు సంబంధాలు లేవని స్పష్టం చేసింది. దావూద్ ఇబ్రహీంతో నయీంకు సంబంధాలున్నట్లు కూడా ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
నక్సల్స్ సమాచారం కోసం నయీంకు ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణల్లో కూడా నిజం లేదని, పిటిషనర్ తగిన ఆధారాలు చూపలేకపోయారని వ్యాఖ్యానించింది. నయీం కేసులో ఎమ్మెల్యేతో పాటు 11 మంది పోలీసాఫీసర్లను విచారించినట్లు, వారిని సాక్షులుగా చేరుస్తున్నట్లు తెలిపింది.
నయీం కేసులో ఇప్పటి వరకు 848 మందిని విచారించినట్లు, మరో 217 మందిని విచారించాల్సి ఉన్నట్లు తెలంగాణ హోం శాఖ తన కౌంటర్లో తెలిపింది.