26 అమలు చేస్తూ దేశంలోనే తొలి స్థానంలో: మంత్రి కెటిఆర్
కరీంనగర్: పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిత్యం కృషి చేస్తున్నారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లలో అన్నారు.
తెలంగాణలో ఇరవై ఆరు పథకాల్ని అమలు చేస్తూ దేశంలోనే ఉత్తమ సంక్షేమ రాష్ట్రంగా నిలుపుతున్నామని చెప్పారు. సిరిసిల్లలో కెటిఆర్ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. వేములవాడ నియోజకవర్గంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు. అన్ని వర్గాల నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనానికి వంట గ్యాస్ను అందించడానికి చర్యలు తీసుకుంటామని, పేద కుటుంబాలన్నింటికీ దీపం పథకం అందిస్తామన్నారు.
తెలంగాణను బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణంలో రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్ల తర్వాత మూడో స్థానంలో వేములవాడ నిలిచిందన్నారు.
2019 వరకు అన్ని నియోజకవర్గాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం, పన్నుల వసూళ్లు, అక్షరాస్యత వంటివాటిని పూర్తిచేసి దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు.
కెటిఆర్ ఇంకా మాట్లాడుతూ... మసీదుల్లో ఇమామ్లకు మాదిరిగా చర్చి ఫాదర్లకు కూడా వేతనాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. మానవత్వానికి ప్రతిరూపం సీఎం కేసీఆర్ అని, అన్నివర్గాల ప్రజలు ఆనందంగా పండుగలు జరుపుకోవాలన్నదే సీఎం లక్ష్యమన్నారు.