అప్పుడు బెంగాల్.. ఇప్పుడు తెలంగాణ: దేశానికి మార్గదర్శకమంటూ హరీశ్ రావు వ్యాఖ్యలు
హైదరాబాద్: నగరానికి నలుదిక్కులా మూడు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు భూమి చేసిన ఈరోజు సువర్ణ దినమని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ ఆస్పత్రులు రాబోయే 50 ఏళ్ల అవసరాలను తీర్చగలవన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్వాల్, గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆస్పత్రుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా మాట్లాడారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి జనాభా బాగా పెరిగిందని.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రుల గురించి గత ప్రభుత్వాలు ఆలోచించలేదని హరీశ్ రావు ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు ఆస్పత్రులు పుట్టుకొచ్చాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల గురించి నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ సర్కారు ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రులను నిర్మిస్తోందన్నారు. వరంగల్ హెల్త్ సిటీతోపాటు దాదాపు 7500 పడకలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మూడు టిమ్స్లలో 3వేల ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. జంట నగరాలకే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు కూడా ఉపయోగపడుతుందన్నారు.
1956 నుంచి 2014 వరకు మూడే మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశానికే ఆదర్శంగా జిల్లాకు ఒకటి చొప్పున 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రకటించారని, రాబోయే రెండేళ్లలో ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని హరీశ్ రావు తెలిపారు. గతంలో బెంగాల్ ఏం చేస్తే దేశమంతా అదే చేస్తుందనే నానుడి ఉండేదని.. ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తే దేశం కూడా అదే అనుసరిస్తోందనే నానుడి నిజం అవుతుందన్నారు హరీశ్ రావు.
కేసీఆర్ రైతుబంధు ప్రారంభిస్తే.. ఆ తర్వాత దేశమంతా అలాంటి పథకం వచ్చిందన్నారు. దేశానికి ఆదర్శంగా, మార్గదర్శకంగా తెలంగాణ నిలుస్తోందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఏడేళ్లలో డయాలసిస్ సెంటర్లను 3 నుంచి 102కు పెంచామని హరీశ్ రావు వివరించారు. హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలు సూపర్ హిట్ అయ్యాయని, 15వ ఆర్థిక సంఘం కూడా బస్తీ దవాఖాలను కొనియాడిందన్నారు. కొందరు నేతలు సోయి లేకుండా ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.