రిటైర్మెంట్ ఉద్యమం నుంచి కాదు, ఇక సంపూర్ణ తెలంగాణ కోసం: కోదండ
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం పదవీ విరమణ చేశారు. చివరగా సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విద్యార్థులకు విద్యా బోధన చేశారు. విద్యార్థులు, సహ ఆచార్యులు ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. 34 ఏళ్ల అధ్యాపక వృత్తి తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఇకపై సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరింత కృషి చేస్తానని చెప్పారు. పదవీ విరమణతో ఎక్కువ సమయం తెలంగాణ కోసం కేటాయించే అవకాశం కలుగుతుందన్నారు.
తాను అధ్యాపక వృత్తి నుంచి మాత్రమే రిటైర్మెంట్ అయ్యానని, తెలంగాణ ఉద్యమం నుంచి కాదన్నారు. ఇక సంపూర్ణ తెలంగాణ కోసం కృషి చేస్తానని చెప్పారు. కాగా, కోదండరామ్ జేఏసీ పొలిటికల్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కోదండరాంకు విద్యార్థులు, సహ ఆచార్యులు ఘనంగా వీడ్కోలు పలికారు.

రైతు ఆత్మహత్యలు: శాసన సభలో పోచారం వివరణ
తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇవాళ మొదటిసారిగా ఒక సమస్యపై ఎలాంటి గొడవ లేకుండా చర్చ జరగడం చూశానని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసన సభలో అన్నారు. రైతు సమస్యలు, ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రసంగించారు.
ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే మొదట జీవన్రెడ్డి చర్చ మొదలు పెట్టారని రవీంద్రకుమార్ వరకు ప్రశాంతంగా జరిగిందన్నారు. ఏదో చివరన చిన్న గొడవ మాత్రం ఏర్పడిందన్నారు. రైతు సమస్యలపై సీఎం సమాధానం చెబితేనే తమకు సంతృప్తినిస్తుందని సీఎం ద్వారానే సమాధానం ఇప్పించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.
ఇలాంటి సాంప్రదాయం ఎక్కడా లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. పోచారం అందుకుని తాను రైతు సమస్యలపై సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. ఇవాళ అర్థరాత్రి అయినా సరే రైతు సమస్యలపై చర్చించి వారికి పరిష్కారం చూపిద్దామన్నారు.
అందరం కలిసి రైతులకు సందేశం ఇద్దామని, వారిలో నమ్మకం, భరోసా కల్పిద్దామని కోరారు. తాను సమాధానం చెప్పేందుకు సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బంగారు తెలంగాణ సాధనకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు.












Click it and Unblock the Notifications