బీజేపీని కూకటివేళ్లతో పెకిలించేద్దాం.. నాతో కలిసిరండి పోరాడదాం.. మోదీపై కేసీఆర్ డైరెక్ట్ ఎటాక్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. రైతుల ఆదాయన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ఇప్పుడు వారి నడ్డి విరిస్తోందని విమర్శించారు. ఎరువుల ధరలను వీపరీతంగా పెంచడమే కాకుండా సబ్సిడీని ఎత్తివేసి వ్యవసాయ ఖర్చును రెట్టింపు చేసిందని మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా కేంద్రం దుర్మార్గపు చర్యలకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని వారి స్వంత పొలాల్లోనే కూలీలుగా మర్చే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు
Recommended Video

పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం ..
దేశంలో వ్యవసాయ రంగం రోజు రోజుకు కుదేలు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రం తీసుకుంటున్న విధానాలతో రైతాంగం చిన్నాభిన్నమౌతోందని మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు విపరీతంగా పెంచి రైతాంగం నడ్డి విరిచిందని మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం ఉల్టా వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు.

బీజేపీని కూకటివేళ్లతో పెకిలించాలి..
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం నాగండ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకొలేని పరిస్థితులు దాపురించాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదు..
దేశ రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ మండిపడ్డారు. కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేస్తుందని విమర్శించారు. ఎన్ ఆర్ జీ ఈ నీ వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయకుండా నాన్చుతుంది. విపరీతంగా ఎరువుల ధరలు పెంచడం... రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం ... వెనక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్రలను ఎదుర్కోవాలన్నారు.

కేంద్రానికి బుద్ధి చెబుతాం.. ఎక్కడిక్కడ నిలదీద్దాం..
బీజేపీ కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం కెసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకునీ బీజేపీ ప్రభుత్వంపై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలనీ కేసీఆర్ పిలుపునిచ్చారు..












Click it and Unblock the Notifications