బ్రాండెడ్ కాదు.. జనరిక్ మెడిసన్ పేర్లనే ప్రిస్కిప్షన్లలో రాయాలి: డాక్టర్లకు వైద్య మండలి కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ వైద్య మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా రోగులకు ప్రిస్కిప్షన్పై మందులు రాసే విషయంలో వైద్యులకు రాష్ట్ర వైద్య మండలి కీలక ఆదేశాలు జారీ చేసింది. జనరిక్ మెడిసిన్ పేర్లనే ప్రిస్కిప్షన్లలో రాయాలని సూచించింది.
ఔషధాల బ్రాండ్ నేమ్ మాత్రం రాయవద్దని ఆదేశాల్లో స్పష్టం చేసింది. మెడిసిన్ బ్రాండెడ్ పేర్లకు బదులుగా వాటిలోని కాంపౌండ్ మెడిసిన్లనే పేర్కొనాలంటూ గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను వైద్య మండలి గుర్తు చేసింది. మందుల చీటీల్లో బ్రాండ్ నేమ్ పేర్కొనరాదని ఇటీవల భారతీయ వైద్య మండలి, లోకాయుక్త కూడా చెప్పిన విషయాలను పాటించాలని తేల్చి చెప్పింది.
ఇండియన్ మెడిసిన్ కౌన్సిల్, లోకాయుక్త ఆదేశాలకు విరుద్ధంగా వైద్యులు బ్రాండెడ్ పేర్లనే సూచిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలంగాణ వైద్యమండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తెలంగాణ వైద్య మండలి స్పష్టం చేసింది.
ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు విధిగా ఔషధ జనరిక్ పేర్లనే ప్రిస్కిప్షన్లో సూచించాలని పేర్కొంది. బ్రాండెడ్ మెడిసిన్స్తో పోలిస్తే జనరిక్ మెడిసిన్స్ చాలా చౌకగా లభిస్తాయని.. ఒకవేళ ప్రిస్కిప్షన్పై బ్రాండెడ్ మెడిసిన్స్ రాస్తే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి హెచ్చరికలు జారీ చేసింది.
కాగా, జనరిక్ మందులు బ్రాండెడ్ మందులకు పేరు మాత్రమే వేరు తయారీ ఒకటే ఫార్ములా ఒకటే. జనరిక్ మందులు తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి అవి సరిగా పని చేస్తాయో చేయవో అని ప్రజలు భయపడుతున్నారు. జనరిక్ పైన డాక్టర్ల కూడా శ్రద్ద చూపడంలేదనే వాదన ఉంది. అయితే కొందరు డాక్టర్లు మాత్రం జనరిక్ వైపే మొగ్గుచూపుతున్నారు. రెండు మూడు రోజుల్లో వాడే మందులు బ్రాండెడ్ కొన్నా పర్లేదు కాని నెలల తరబడి మందులు వాడే వారు మాత్రం జనరిక్ కొనడమే ఉత్తమం అంటున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మందులకి అయ్యే ఖర్చు నెలకి వేయికి పైనే ఉంటుంది. కానీ, జనరిక్ మందులపై దృష్టి పెడితే మందుల కోసం చేసే ఖర్చు చాలా వరకు వరకు తగ్గనుంది.