ప్రజల ఇబ్బందులను పట్టించుకోరా?: కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై కేంద్రానికి కేటీఆర్ ప్రశ్న
హైదరాబాద్: నగర పరిధిలోని కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ప్రజలకు కనీస వసతులు కల్పించలేకపోతే సికింద్రాబాద్ కంటోన్మెట్ బోర్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయాలని ప్రతిపాదించారు.
కంటోన్మెంట్ రోడ్ల మూసివేతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రోడ్ల మూసివేత సమస్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్.. కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలకు ట్వీట్ చేశారు.
'అక్రమంగా రోడ్ల మూసివేతపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తుంటే కేంద్రం ఎందుకు నియంత్రించడం లేదు?' అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
Sri @kishanreddybjp Garu and Sri @rajnathsingh Ji
— KTR (@KTRTRS) December 18, 2021
This highly objectionable & illegal closure of roads is causing heartburn among millions of civilians in and around the Secunderabad Cantonment area
What is preventing Govt of India from reining in violation of LMA rules? https://t.co/SI9xQuWgwh
'కేవలం రెండు రోడ్లను మాత్రమే మూసివేశారంటూ పార్లమెంటులో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ప్రకటన చేశారు. 2 కాదు 21 రోడ్లు మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే జీహెచ్ఎంసీలో విలీనం చేసి సమస్యలను పరిష్కరించుకుందాం' అని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.
కాగా, కంటోన్మెంట్లో రోడ్లను మూసివేయడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్రంపై మండిపడ్డారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలంటూ కోరారు.