కాంగ్రెస్ యోధులకు గ్రాండ్ వెల్కమ్ పలికిన ఖమ్మం
Telangana Congress: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై నాలుగురోజులే అయింది. కొత్త ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు. పూర్తి స్థాయి మంత్రివర్గమూ ఏర్పాటు కాలేదు. ముఖ్యమంత్రి మినహా మంత్రులు ఇంకా తమ బాధ్యతలనూ స్వీకరించనూ లేదు.
మంత్రులు ఇంకా తమ బాధ్యతలను తీసుకోవాల్సి ఉంది. పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించడానికి కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరో ఆరుమందిని కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తోంది. దీనికోసం ఆశావహుల జాబితాను వడపోస్తోంది. ఇప్పటివరకు ప్రాధాన్యత లేని జిల్లాలు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుత మంత్రివర్గంలో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు.. ముగ్గురూ ఈ జిల్లాకు చెందిన వారే. భట్టి విక్రమార్క- మధిర, పొంగులేటి- పాలేరు, తుమ్మల నాగేశ్వర రావు- ఖమ్మం నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఈ ముగ్గురూ తొలిసారిగా ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టారు. ఈ ఉదయం ఖమ్మం జిల్లాకు చేరుకోగానే వేలాదమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వారికి అద్దిరిపోయేలా స్వాగతం పలికారు. గజమాలలతో సత్కరించారు.

ఖమ్మం టోల్ గేట్ దాటిన వెంటనే ప్రత్యేకంగా ర్యాలీని ఏర్పాటు చేశారు. ముగ్గురూ ఒకే వాహనంపై ప్రదర్శనగా బయలుదేరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీని చేపట్టారు. ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలు, టూవీలర్లతో వారి వెంట ర్యాలీగా సాగిపోయారు.












Click it and Unblock the Notifications