దేశ వ్యాప్త ఎన్నికలకు బీజేపీ సిద్ధమా - ఆయనవి బోగస్ మాటలు : షా పై టీ మంత్రుల ఫైర్..!!
కేంద్ర హోం మంత్రి తెలంగాణ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలు..టీఆర్ఎస్ - సీఎం కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రులు తిప్పి కొట్టారు. అమిత్ షా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేసారు. అవినీతి - అసమర్ధత అంటూ వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు ఎప్పుడైనా సిద్దమేనని..రేపే ఎన్నికలు పెట్టాలని సవాల్ చేసారు. దీని పైన స్పందించిన మంత్రి తలసాని కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి దేశ వ్యాప్త ఎన్నికలకు బీజేపీ సిద్ధమా అని సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నాం కదా అని ఏదైనా మాట్లాడుతామంటే కుదరదని స్పష్టం చేసారు

సీఎం కేసీఆర్ లక్ష్యంగా షా మాటల దాడి
కేంద్రమంత్రి హోదాలో అమిత్ షా అలా మాట్లాడటం సరికాదని మంత్రి చెప్పుకొచ్చారు. గుజరాత్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎందుకు నిర్మించలేదని తలసాని ప్రశ్నించారు. కళ్లుండి చూడలేని కబోదులు బీజేపీ నాయకులని... ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి తలసాని చెప్పారు. పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని చెప్పారు. కేసీఆర్ ముందుచూపుతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. తుక్కుగూడలో సభావేదికగా అమిత్ షా అబద్ధాలు మాట్లాడారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తెరాస ఎన్నికల హామీల్లో 99 శాతం నెరవేర్చిందన్న ఎర్రబెల్లి.. భాజపా కనీసం ఒక్కటైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచి పేదల నడ్డివిరిచారని విమర్శించారు.

ఎన్నికలకు సిద్దమేనంటూ
వరంగల్ సైనిక్ స్కూల్, కోచ్ ఫ్యాక్టరీ, వైద్య కళాశాలలపై అమిత్ షా వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని ఎర్రబెల్లి కొట్టిపారేశారు. కేసీఆర్ తెలంగాణ గాంధీ. ఆయన కుటుంబమంతా పదవుల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చిందో అమిత్ షా చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ను ఎదుర్కొనేందుకు బండి సంజయ్ చాలన్న అమిత్ షా.. తెలంగాణకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీసారు. ప్రధాని మోదీ దేశంలోని సంపదను అదాని, అంబానీలకు దోచి పెడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని..ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించామని చెప్పారు.

అమిత్ షా అబద్దాలు చెబుతున్నారు.
పేదల మొహంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. వంట గ్యాస్ ధరలు తగ్గించే వారకూ బీజేపీ నేతలకు బయటకు రానీయద్దంటూ మంత్రి సబిత పిలుపునిచ్చారు. ధరలు తగ్గించకపోతే..ప్రజలు బీజేపీని గద్దె దించుతారని హెచ్చరించారు. అమిత్ షా కేంద్ర మంత్రి హోదా మరిచి కింది స్థాయి నాయకుడిగా మాట్లాడారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మీద, తెలంగాణ అభివృద్ధి మీద విషం చిమ్మడం తప్పా తెలంగాణ ప్రజలకు ఉపయోగ పడే మాట ఒక్కటైన చెప్పారా అని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర తెలంగాణ రైతులను మోసం చేసిందని మంత్రి హరీష్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications