తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేడే... అన్ని ఏర్పాట్లు పూర్తి... ఓట్లను ఎలా లెక్కిస్తారంటే...?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ బుధవారం(మార్చి 17) జరగనుంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల కౌంటింగ్కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు.
హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి స్థానానికి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో,వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి నల్గొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు రాజకీయ పార్టీల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తామని.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. పోలైన ఓట్లను 25 చొప్పున కట్టలుగా కడతారని... ఈ పక్రియ పూర్తయ్యేందుకు సాయంత్రం అవుతుందని చెప్పారు. ఒక్కో కౌంటింగ్ టేబుల్పై 40 కట్టలు(1000 ఓట్లు) పెడుతామన్నారు. మొత్తం 8 హాళ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు.ఒక్కో హాల్లో 7 టేబుల్స్ చొప్పున మొత్తం 56 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
బుధవారం సాయంత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారని.. మూడు షిఫ్టుల్లో కౌంటింగ్ సిబ్బంది పనిచేస్తారని చెప్పారు. ఫోన్లు, ఇతర సామాగ్రితో వచ్చే పార్టీల ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రం లోపలికి అనుమతించమన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కాగా,ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలా ఉండదు. మొత్తం పోలైన ఓట్లలో సగానికి కంటే ఎక్కువ ఓట్లు వస్తేనే ఆ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచినట్లు ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ 50శాతం కన్నా ఎక్కువ ఓట్లు రాకపోతే.. ఎలిమినేషన్ పద్దతిని అనుసరిస్తారు.
అందరి కన్నా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి ఎలిమినేట్ చేసి... అతనికి పోలైన ఓట్లలో ప్రాధాన్యత ప్రకారం ఆ ఓట్లను మిగతా అభ్యర్థులకు పంపిణీ చేస్తారు. ఒకవేళ అప్పటికీ ఎవరికీ 50శాతం కన్నా ఎక్కువ ఓట్లు రాకపోతే... అందరికన్నా తక్కువ ఓట్లు పోలైన మరో అభ్యర్థిని ఎలిమినేట్ చేసి మళ్లీ అలాగే ఓట్లు పంపిణీ చేస్తారు. తుది ఫలితం వచ్చేంతవరకూ ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు కావడంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు-కృష్ణా, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా నేడే జరగనుంది.