మూడు కొత్త ఎయిర్పోర్టులు.. ఏరోస్పేస్, డిఫెన్స్ గ్లోబెల్ హబ్ గా తెలంగాణ!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఏవియేషన్ రంగాన్ని మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం కొత్త కార్యాచరణ చేపట్టిందని ప్రకటించారు. తెలంగాణను ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాల్లో గ్లోబల్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఏరోమార్ట్ 2026 సదస్సులో మంత్రి కీలకవ్యాఖ్యలు
రాష్ట్రంలో మూడు కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో జరిగిన ఏరోమార్ట్ 2026 సదస్సులో మాట్లాడిన మంత్రి ఈ కీలకవ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో వరంగల్ ఎయిర్ఫీల్డ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచే లక్ష్యంతో ఆదిలాబాద్లో పౌర మరియు సైనిక అవసరాల కోసం సంయుక్త విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నామన్నారు.

ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాల్లో గ్లోబల్ హబ్గా తెలంగాణా
అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో కొత్త ఎయిర్ఫీల్డ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు త్వరలో లభించనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణను ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాల్లో గ్లోబల్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,500కి పైగా ఎంఎస్ఎంఈలు ఏరోస్పేస్, రక్షణ రంగాలకు సంబంధించిన విడిభాగాలు తయారు చేస్తున్నాయని చెప్పారు.
యూఎస్, యూకే వంటి దేశాల సంస్థలు తెలంగాణాలో పెట్టుబడులు
అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్ వంటి దేశాల సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. హైదరాబాద్లో టాటా సికోర్స్కీ, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ వంటి దిగ్గజ సంస్థలు అత్యాధునిక హెలికాప్టర్లు, ఫైటర్ జెట్ల విడిభాగాలు తయారు చేస్తున్నాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సఫ్రాన్, జీఈ ఏరోస్పేస్ వంటి కంపెనీలు ఇంజన్ భాగాలు, మెయింటెనెన్స్ సేవలు అందిస్తున్నాయని వివరించారు.
కొత్త విమానాశ్రయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం
జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్లో ఇటీవల జరిగిన శంకుస్థాపనలు రాష్ట్రం ఏరోస్పేస్ రంగంలో సాధిస్తున్న పురోగతికి నిదర్శనమన్నారు. ఈ కొత్త విమానాశ్రయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలపరుస్తాయని, ఉపాధి అవకాశాలను పెంచుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.ఏరోమార్ట్ 2026 సదస్సులో జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు డా. జి. సతీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. భారతదేశం ఏరోస్పేస్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ ఈ ఎకోసిస్టమ్లో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.













Click it and Unblock the Notifications