తెలంగాణ నూతన సచివాలయంకు ‘గోల్డ్ రేటింగ్’: దేశంలోనే మొదటిది
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ అద్భుత కట్టడం ప్రతిషాత్మక ఐటీబీసీ గోల్డ్ రేటింగ్కు ఎంపిక కావడం విశేషం. దేశంలో ఈ రేటింగ్ లభించిన తొలి సచివాలయం ఇదే కావడం గమనార్హం. కొత్త సచివాలయం గోల్డ్ రేటింగ్కు ఎంపికైందని.. ఆ రేటింగ్ ప్రమాణాలను పాటించిన సచివాలయం దేశంలో మరొకటి లేదని హరితభవన మండలి హైదరాబాద్ చాప్టర్ ఛైర్మన్ సి శేఖర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ కొత్త సచివాలయాన్ని హరిత భవన మండలి(ఐజీబీసీ-ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) ప్రమాణాల మేరకు నిర్మించారని ఆయన స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో 100 శాతం ఎల్ఈడీ వ్యవస్థను ఏర్పాటు చేశారని.. విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించేందుకు భవన నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేశారని శేఖర్ చెప్పారు. భవన ప్రాంగణంలో పచ్చదనం కోసం స్థానిక మొక్కలను తీసుకున్నారన్నారు. సెంట్రల్ కోర్టు యార్డు నమూనాను వినియోగించారన్నారు. భవనాలను హరిత ప్రమాణాలతో నిర్మిస్తే.. అందుబాటులో పనిచేసే వారి ఉత్పాదకత పెరుగుతుందని.. నీరు, విద్యుత్ వినియోగంలో 30-40 శాతం వరకు ఆదా అవుతుందని వివరించారు.

గోల్డ్ రేటింగ్ విషయానికొస్తే.. భవన నిర్మాణంలో హరిత ప్రమాణాలను పాటించినట్లు ఆయా సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్కు దరఖాస్తు చేసుకుంటాయి. అవి అలా ప్రమాణాలను పాటించాయా? లేదో గుర్తించేందుకు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన నిపుణులతో కౌన్సిల్ ఉంటుంది. ఆ నిపుణుల బృందం నిర్మాణాన్ని పరిశీలిస్తుంది. నిర్మాణ తీరును తెలుసుకుంటుంది. ఐజీబీసీ ప్రమాణాల మేరకు నిర్మాణం జరిగినట్లు తేలితే అప్పుడు గోల్డ్ రేటింగ్ ఇస్తుంది. ఈ ప్రక్రియలోనే తెలంగాణ సచివాలయానికి గోల్డ్ రేటింగ్ దక్కింది.
గాలి, వెలుతురు పుష్కలంగా భవనంలోకి రావాలి. అలాగే నీటి వృథాను నియంత్రించేందుకు సెన్సర్స్, ఆటోమేటిక్ విద్యుత్తు పరికరాలు వినియోగించాలి. ఇలాంటి నిబంధనలు పాటిస్తే ప్లాటినం, గోల్డ్, సిల్వర్, సర్టిఫికెట్.. గుర్తింపు ఇస్తారు. కాగా, తాజాగా, సెక్రటేరియట్ గోల్డ్ రేటింగ్కు ఎంపిక కావడంతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భవనాల్లో రెండింటికి ఈ రేటింగ్ లభించిందినట్లయింది. ఇంతకుముందు హైదరాబాద్లో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు గోల్డ్ రేటింగ్ దక్కింది.












Click it and Unblock the Notifications