తెలంగాణలో గ్రూప్ 1,2 అభ్యర్థులకు గుడ్న్యూస్: ఇంటర్వ్యూలు ఎత్తివేత
హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగార్థులకు ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. గ్రూప్ 1,2 ఉద్యోగాల భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరం లేదనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు కూడా తెలంగాణ కేబినెట్ శుభవార్త చెప్పింది. పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితి పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాగా, తెలంగాణలో త్వరలోనే భారీ స్థాయిలో ఉద్యోగా నియామకాలను చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్యోగాల భర్తీకి కసరత్తులను కూడా ప్రారంభించింది.
రాష్ట్రంలో గ్రూప్-1 ప్రకటన జారీకి టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది. గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీకి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన కమిషన్ వాటిని క్రోడీకరిస్తోంది. మొత్తం 12 శాఖల నుంచి 19 రకాల పోస్టులకు ప్రతిపాదనలు అందగా వాటిలో నాలుగైదు రకాల పోస్టులకు ఆయా విభాగాల నుంచి సవరణ ప్రతిపాదనలు అందాల్సి ఉంది. అవి రాగానే ప్రకటన జారీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది.
యూనివర్సిటీల్లో 3500 ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని యూనివర్సిటీల్లో కలిపి దాదాపు 3,500 పైచిలుకు ఖాళీలున్నాయని వెల్లడించారు.
కామన్ బోర్డు ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. వేరే రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ ఖాళీల వివరాలను తెప్పించుకొని, వాటికనుగుణంగా భర్తీ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఈ నియామకాలు పారదర్శకంగా చేపట్టనున్నట్లు చెప్పారు.