ఏపీకి అనుకూలంగా..: కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్
హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసింది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్.. ఏపీ ప్రభుత్వానికి మద్దతిస్తూ శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని.. సాగర్, కృష్ణా డెల్టా అవసరాలకు అనుగుణంగానే విద్యుత్ ఉత్పత్తి ఉండాలన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం సమావేశం నుంచి తెలంగాణ అధికారులు బయటకు వచ్చారు.
కృష్ణా జల వివాదాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 14వ సమావేశం కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. బోర్డు ప్రతినిధులతోపాటు, రెండు రాష్ట్రాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణకు జల విద్యుత్ ఉత్పత్తి చాలా అవసరమని అధికారులు సమావేశంలో స్పష్టం చేశారు. భౌగోళిక స్వరూపం దృష్ట్యా ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగు నీరు ఇవ్వాల్సి ఉందని, వ్యవసాయ బోరు బావులకు కూడా విద్యుత్ ఉత్పత్తి కావాలని వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించిన ప్రాజెక్టని తెలిపారు. అందుకే జల విద్యుత్ ఉత్పత్తి అత్యవసరమని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు.
అయితే, తెలంగాణ అధికారుల వాదనపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. దిగువన సాగునీటి అవసరాలు లేనప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తే తమకు నష్టం జరుగుతుందని తెలిపారు. నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాలో సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ అధికారులు సమావేశం నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత కృష్ణా బోర్డు సమావేశం ముగిసింది. ఇది ఇలావుండగా, ఈ సమావేశం ముగిసిన అనంతరం కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం ప్రారంభమైంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డుల చైర్మన్ల ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశం జరుగుతోంది. సమావేశానికి రెండు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై ఈ సందర్భంగా చర్చించనున్నారు.
కాగా, కేఆర్ఎంబీ సమావేశం సందర్బంగా తెలంగాణ నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్కుమార్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీపై రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ వాదనలు వినిపించింది. గతంలో జరిగిన కృష్ణా జలాల పంపిణీ తాత్కాలికమేనని రాష్ట్ర నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్కుమార్ పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య 512:299 నిష్పత్తిలో నీటి పంపిణీ తాత్కాలికమేనన్నారు.
కేవలం 2015-16 ఏడాదికి వర్తించేలా మాత్రమే అంగీకారం కుదిరిందని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు పూర్తయ్యాయని, దీంతో నీటి వినియోగం పెరిగిందన్నారు. 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీని 2018 నుంచి కోరుతున్నామని తెలిపారు. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా నీటి పంపిణీ జరుగాలన్నారు. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరుగాలని, 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీపై రాజీపడేది లేదన్నారు. నీటి పంపిణీపై బోర్డు సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏపీ, తెలంగాణ మధ్య 70:30 నిష్పత్తిని అంగీకరించమని రజత్ కుమార్ తేల్చి చెప్పారు. కేఆర్ఎంబీ సమావేశం పూర్తిగా విఫలమైందన్నారు. అందుకే తాము వాకౌట్ చేశామని రజత్ కుమార్ తెలిపారు.