విశాఖ ఉక్కుపై సంచలనం: ఉద్యమానికి తెలంగాణ మద్దతు -రాష్ట్ర ప్రభుత్వాలనూ మోదీ అమ్మేస్తాడు: KTR
విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు సంబంధించి మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు, ఉద్యోగులు, స్థానికులు చేస్తోన్న ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. అవసరమైతే వైజాగ్ వెళ్లి నేరుగా ఉద్యమంలో పాల్గొంటామని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనను విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వాగతించారు.
ఆంధ్రుల హక్కుకు తెలంగాణ మద్దతు
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో, జనం ప్రాణత్యాగాలతో ఏర్పాటయిన స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తామని కేంద్రం కరాకండగా చెప్పడం, ఒకవేళ పోస్కో లాంటి సంస్థలు కొనకపోతే ప్లాంటును ఏకంగా మూసేస్తామనీ మోదీ సర్కార్ బెదిరించడం, 2 లక్షల కోట్ల విలువైన భూముల్ని కేవలం 35వేల కోట్లకే ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం, దీనిపై స్థానికంగా ఉద్యమం కొనసాగుతుండం తదితర పరిణామాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. బుధవారం హైదరాబాద్ లో ఓ కీలక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మీడియాతో మాట్లాడుతూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
వైజాగ్కు తెలంగాణ మంత్రులు
''తెలంగాణలోని బయ్యారంలో సెయిల్ ద్వారా ఉక్కు కర్మాగారం పెడతామని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేంద్ర సర్కారు గతంలో వాగ్ధానాలు చేసింది. వాటిని పట్టించుకోకపోగా, ఏపీలోని విశాఖలో జనం పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయంతో వేలాది మంది ఉక్కు ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఉక్కు ఉద్యమానికి మేం మద్దతు పలుకుతున్నాం. ఉద్యోగులందరికీ అండగా నిలబడతాం. అవసరమైతే.. కేసీఆర్ ఆనుమతితో వైజాగ్ వెళ్లి ప్రత్యక్షంగా వారి పోరాటానికి మద్దతు తెలియజేస్తాం. ఎందుకంటే..
ప్రభుత్వాలనూ ప్రైవేటుకు ఇస్తారు..
పొరుగు రాష్ట్రంలో ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం కదా, మనకెందుకులే అని అనుకుంటే రేప్పొద్దున తెలంగాణకు కూడా వస్తారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతోన్న కేంద్రం.. రేపు హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ సంస్థను అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి సంస్థను కూడా తెగనమ్ముతారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకులే అనుకుని వాటినీ ప్రైవేటు పరం చేస్తారు. కేంద్రంలో ఉన్నది అంతటి ఘటికులే మరి. ఆ పరిస్థితి రావొద్దనే మేం విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తాం'' అని మంత్రి కేటీఆర్ చెప్పారు. అదే సమయంలో..
జగన్ కూడా అండగా ఉండాలి..
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి తెలంగాణ మద్దతు ఇస్తున్నట్లుగానే, రేప్పొద్దున కేంద్రం గనుక తెలంగాణలో ప్రభుత్వ సంస్థలను అమ్మే ప్రయత్నం జరిగితే, ఏపీ వాళ్లు కూడా కలిసిరావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కుకు కర్మాగారం అమ్మకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రోజుకో పిడుగులాంటి ప్రకటన చేస్తుండటం స్థానికుల గుండెల్లో గుబులు రేపుతున్నది. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళతామని సీఎం జగన్ చెప్పడం, ఆ మేరకు ప్రధానికి లేఖ రాయడం తెలిసిందే. విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు ఇస్తామనడాన్ని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వాగతించారు. కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కాగా,
బీహెచ్ఈఎల్, సింగరేణి ప్రైవేటుకేనా?
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రం తీరును విమర్శిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తికర చర్చలు జరుగుతున్నది. నాలుగు వ్యూహాత్మక రంగాలు తప్ప మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ అమ్మేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే స్పష్టం చేసిన దరిమిలా, హైదరాబాద్ లో కొలువైన పదుల కొద్దీ కేంద్ర సంస్థలు, తెలంగాణ వరదాయినిగా ఉన్న సింగరేణి సంస్థలపైనా అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. బీహెచ్ఈఎల్, సింగరేణిలనూ మోదీ వదిలిపెట్టబోడని కేటీఆర్ హెచ్చరించారు. సింగరేణిలో 51శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాకాగా, కేంద్రం తన 49 శాతం వాటాను విక్రయించుకునే అవకాశాలు లేకపోలేవని తెలుస్తోంది. ఇలా జరిగే చాన్స్ ఉండబట్టే ముందుగానే తెలంగాణ సర్కారు పొరుగురాష్ట్రమైన ఏపీని ముందస్తుగానే మద్దతు కోరుతున్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని కామెంట్లు వస్తున్నాయి.
ఒక్కరోజు ముఖ్యమంత్రికి బీజేపీ గాలం -నటుడు అర్జున్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ -అంత లేదంటూ