దిగ్భ్రాంతి : ప్రజా వాగ్గేయకారుడు నిస్సార్ కరోనాతో మృతి.. రాలిపోయిన 'పండు వెన్నెల'..
కవి, తెలంగాణలో ఏకైక ముస్లిం వాగ్గేయకారుడు నిస్సార్ను కరోనా బలి తీసుకుంది. కరోనా బారిన పడిన ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(జూలై 8) కన్నుమూశారు. ప్రస్తుతం ఆర్టీసీలో నిస్సార్ కంట్రోలర్గా పనిచేస్తున్నారు. ఆయన మృతి విషయాన్ని ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మీడియాకు వెల్లడించారు.
నిస్సార్ చికిత్స కోసం చాలా ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగారని... ఏ ఆస్పత్రి ఆయన్ను చేర్చుకోలేదని చెప్పారు. చివరికి గాంధీలో చేరగా... అక్కడ వెంటిలేటర్ సదుపాయం లేక మృతి చెందినట్లు తెలిపారు.
నిస్సార్ మృతిపై సీపీఐ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ... ఆయన మరణం ప్రజా ఉద్యమానికి తీరని లోటు అన్నారు. నిస్సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నిస్సార్ మరణం సాహితీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి పట్ల పలువురు కవులు,రచయితలు సంతాపం ప్రకటించారు. తెలంగాణలో ఉన్న ఏకైక తెలుగు ముస్లిం వాగ్గేయకారుడు నిస్సారే కావడం గమనార్హం. ఆయన రాసి పాడిన 'పండు వెన్నెల్ల లోన వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయే..' పాట చాలా పాపులర్.
ఆర్టీసీలో పనిచేస్తూనే ప్రజా నాట్య మండలి సభ్యుడిగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన... ఆ క్రమంలో ఎన్నో పాటలు రాశారు. తెలంగాణ ఉద్యమం కోసం కూడా ఎన్నో పాటలు రాసి పాడారు. బస్సులో టికెట్లు కొడుతూ... మదిలోనే ఎన్నో పాటల్ని సృష్టించాడు. అలాంటి వ్యక్తిని కరోనా బలి తీసుకోవడం తెలంగాణ సాహితీ సమాజాన్ని శోకసంద్రంలో ముంచింది.












Click it and Unblock the Notifications