దయాకర్ రికార్డు: ఏడో అత్యధిక మెజారిటీ, పీవీది మూడో స్థానం, జగన్కు ఐదో స్థానం
వరంగల్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో భారీ మెజారిటీని సాధించి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు సృష్టించారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన లోకసభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన నాయకుల్లో దయాకర్ ఏడో స్థానంలో నిలిచారు.
దయాకర్ 4 లక్షల 59 వేల పైచిలుకు మెజారిటీతో కాంగ్రెసు అభ్యర్థి సర్వే సత్యనారాయణపై ఘన విజయం సాధించారు. ఆయనకు పోటీగా నిలిచిన అభ్యర్థులందరికీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. బిజెపికి చెందిన ప్రీతమ్ ముండే మెజారిటీ విషయంలో ప్రథమ స్థానంలో నిలిచారు. మహరాష్ట్రలోని బీద్ లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కూతురు ప్రీతమ్ ముండే 6.92 లక్షల ఓట్ల మెజారిటీతో ప్రథమ స్థానంలో నిలిచారు.
సిపిఎంకు చెందిన అనిల్ బసు 2004 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అరమ్గఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5.92 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెసు పార్టీకి చెందిన మాజీ ప్రధాని పివి నరసింహారావు 1991లో నంద్యాల నుంచి పోటీ చేసి 5.80 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
బిజెపి నాయకుడు, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో గుజరాత్లోని వడొదరా నుంచి 5.7 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2011లో కడప లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 5.45 లక్షల ఓట్ల తేడా విజయం సాధించారు.
1989లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హజీపూర్ నుంచి జనతాదళ్ తరఫున పోటీ చేసిన రాం విలాస్ పాశ్వాన్ 5.04 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. పాశ్వాన్ తర్వాతి స్థానాన్ని పసునూరి దయాకర్ దక్కించుకున్నారు.