కరోనా అప్డేట్ : తెలంగాణలో భారీగా కొత్త కేసులు... మరో 9 మంది మృతి
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధ,గురువారం(ఏప్రిల్ 14,15) కేసుల సంఖ్య 3వేల మార్క్ని దాటింది. బుధవారం (ఏప్రిల్ 14 ) రాత్రి 8గంటల నుంచి గురువారం (ఏప్రిల్ 15) రాత్రి 8గంటల మధ్యకొత్తగా 3840 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో తొమ్మిది మంది కరోనాతో మృతి చెందారు. గతంలో రోజుకు రెండు లేదా మూడు మరణాలు మాత్రమే నమోదయ్యాయి. కానీ గత కొద్దిరోజులుగా వరుసగా ఎనిమిది లేదా తొమ్మిది మంది రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు విడుస్తున్నారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం(ఏప్రిల్ 16) విడుదల చేసిన బులెటిన్ ప్రకారం... మరో 5095 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 341,885కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1188కి చేరింది. ప్రస్తుతం 30,494 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 20,215 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 1198 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,09,594కి చేరింది.

ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.52శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 87.8 శాతం ఉండగా తెలంగాణలో 90.55 శాతం ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 505 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,14,81,881 కరోనా టెస్టులు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,17,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,91,917కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 1185 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,74,308కి చేరింది. ప్రస్తుతం దేశంలో 15,69,743 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో నిన్నటి (ఏప్రిల్ 15) వరకు మొత్తం 26,34,76,625 కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 11,72,23,509 మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.
గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 61,695 కేసులు నమోదయ్యాయి. కరోనా నియంత్రణ కోసం మహారాష్ట్రలో సెక్షన్ 144తో పాటు జనతా కర్ఫ్యూ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు రాత్రి 8గంటల నుంచి ఉదయం 7గంటల వరకు జనతా కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. దీంతో ఉపాధి లేక వలస కార్మికులు మళ్లీ స్వస్థలాల బాట పట్టారు. ముంబైలో రైల్వే స్టేషన్లు వేల కొద్ది వలస కార్మికులతో కిక్కిరిసిపోతున్నాయి.












Click it and Unblock the Notifications