తెలంగాణలో కొత్తగా 2982 కరోనా కేసులు... మరో 21 మంది మృతి...
తెలంగాణ కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,74,026కు చేరింది. ఇప్పటివరకూ మొత్తం 3247 మంది కరోనాతో మృతి చెందారు.
గడిచిన 24 గంటల్లో 3,837 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా... ఇప్పటివరకూ మొత్తం 5,33,862 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 1,00,677 శాంపిళ్లను పరీక్షించగా... ఇప్పటివరకూ మొత్తం 1,50,27,996 శాంపిళ్లను పరీక్షించారు. జాతీయ స్థాయిలో కరోనా రికవరీ రేటు 90శాతం ఉండగా తెలంగాణలో 93శాతం ఉంది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 436 కరోనా కేసులు నమోదు కాగా.. నల్గొండ జిల్లాలో 218, ఖమ్మం జిల్లాలో 215 కేసులు వెలుగుచూశాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. నిబంధనలు అతిక్రమించేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ శనివారం(మే 29) మదీనా చెక్ పోస్టు వద్దకు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిబంధనలు ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకూ నిబంధనలు అతిక్రమించినవారిపై 56,466 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని కోరారు.
తెలంగాణలో లాక్ డౌన్ గడువు ఈ నెల 31 వరకు ఉన్న సంగతి తెలిసిందే. ఆదివారం(మే 30) తెలంగాణ కేబినెట్ సమావేశమై లాక్ డౌన్ను పొడగించడమా లేక ఎత్తివేయడమా అన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది. కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరికొద్దిరోజులు లాక్ డౌన్ అమలుచేస్తుందా లేక ఎత్తివేస్తుందా అన్నది చూడాలి.