5వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె.. మరింత ఉధృతమా..! కాసేపట్లో అఖిలపక్షం భేటీ
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె ఐదో రోజుకి చేరింది. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాసేపట్లో జరగనున్న అఖిలపక్ష సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. బుధవారం (09.10.2019) నాటితో సమ్మె ఐదో రోజుకి చేరడం.. అటు ప్రభుత్వం తన నిర్ణయం వెల్లడించడం.. ఇదంతా కూడా జేఏసీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది హాట్ టాపిక్గా మారింది.
ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని ఆరోపిస్తున్న కార్మిక సంఘాల జేఏసీ సమ్మెను మరింత ఉధృతం చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఆ మేరకు కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదే వేదికగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ భేటీకి హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
ఒక్క ఎమ్మెల్యే కోసం ఎన్ని కష్టాలో.. ఆ గుర్తులు కొంప ముంచేనా?
ఆర్టీసీ సమ్మె ఐదో రోజుకు చేరుకోవడంతో తాజా పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయనే ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అటు ప్రభుత్వం మెట్టు దిగకపోవడం.. ఇటు కార్మిక సంఘాలు మరింత బెట్టు చేయడం ఎలాంటి పరిణామాలకు దారి తీయనుందో చూడాలి. అఖిలపక్షం సమావేశం సందర్భంగా ఆర్టీసీ కార్మికుల భవిష్యత్పై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు 26 డిమాండ్లతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా ప్రభుత్వంపై మరింత వత్తిడి పెంచేలా వ్యూహరచన చేస్తున్నారు జేఏసీ నేతలు.
ఆర్టీసీ సమ్మె ప్రభావం క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రభావం చూపుతోంది. దసరా పండుగ వేళ సరైన సంఖ్యలో బస్సులు లేక సొంత గ్రామాలకు వెళ్లేందుకు జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరి ప్రకటించడంతో.. ఇక ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది చర్చానీయాంశంగా మారింది.