మే 21 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తాం: టీఎంయూ
హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు టిఎంయూ ఆధ్వర్యంలో బస్ భవన్ ఎదుట సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. వేతన సవరణతో పాటు ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయాలని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ డిమాండ్ చేసింది.
2017 ఏప్రిల్ నుండి ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన పే స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశ్వద్ధామ రెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులపై చిన్న విషయానికే కేసులు పెడితే సహించేది లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫలాలు ఆర్టీసీ కార్మికులకు అందలేదని చెప్పారు.

హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలు పెరిగిపోయాయని, వాటిని నియంత్రించేందుకు ప్రయత్నించడం లేదన్నారు. ఉద్యమకారుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో అదే ఉద్యమకారుల మీటింగ్కు ఎందుకు అనుమతి దొరకడం లేదని ఆయన ప్రశ్నించారు. కార్మిక, ఉద్యోగులకు ఆర్టీసీలో ఎందుకు ఉద్యోగ భద్రత లేదన్నారు.
ఇతర కార్మిక సంఘాలు కూడా ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం కలిసి రావాలని కోరారు. ఇవాళ జరిగిన ఈ ధర్నా హెచ్చరిక మాత్రమేనని చెప్పారు.ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications