బీజేపీ బడా ప్లాన్: కేసీఆర్కు షాకిచ్చేలా.., ఏపీలో బాబుపై జగన్ దెబ్బ
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సోమవారం తెలంగాణ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం చర్చకు దారి తీసింది. బీజేపీ అంటే హిందుత్వ పార్టీగా ముద్రపడింది.
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సోమవారం తెలంగాణ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం చర్చకు దారి తీసింది. బీజేపీ అంటే హిందుత్వ పార్టీగా ముద్రపడింది.
అలాంటిది తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమలకు కానుకలు సమర్పిస్తే ఎందుకు ప్రశ్నించలేదని అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలను ప్రశ్నించడం గమనార్హం. ఆ వ్యాఖ్యలు వ్యూహాత్మకమే అంటున్నారు.
తిరుపతికి కానుకలిస్తే నిలదీయరా?, గాలి లెక్కలొద్దు: టి నేతలపై షా తీవ్ర ఆగ్రహం
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పట్టు పెంచుకునేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మైనార్టీలపై దృష్టి సారించిందని అంటున్నారు.
ఏపీలో జగన్ అండతో, తెలంగాణలో కేసీఆర్కు ధీటుగా
ఏపీలో జగన్తో కలవడం లేదా ఒంటరిగా పోటీ చేసే దిశగా రాజకీయాలు నడుస్తుండటం, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ధీటుగా మైనార్టీల ఓట్ల కోసం మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏపీ, తెలంగాణల్లో 2019లో బీజేపీకి గెలుపు అవకాశాలు లేవనే చెప్పవచ్చు.
కానీ, ఇప్పటికే ఉన్న ఓటు బ్యాంకుకు తోడు, ఇతర వర్గాలను కూడా దరి చేర్చుకొని బలం పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది. అందులో భాగంగానే ఏపీలో వైసిపి దిశగా అడుగులు, తిరుమల - కేసీఆర్ పర్యటనపై అమిత్ షా వ్యాఖ్యల గూడార్థం అంటున్నారు.
నల్గొండ పర్యటనలో కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో మైనార్టీలు కీలకలం. అమిత్ షా పర్యటించిన నల్గొండలోను అదే పరిస్థితి. ఈ పర్యటన సందర్భంగానే.. కేసీఆర్ తిరుమల పర్యటనపై బీజేపీ జాతీయ అధ్యక్షులు కామెంట్ చేయడం గమనార్హం.
హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో మజ్లిస్ - బిజెపిలు పోటాపోటీగా ఉంటాయి. తెరాస అధికారంలోకి వచ్చాక ఆ పార్టీల ప్రాబల్యం కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. గత ఏడాది జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో మజ్లిస్ అంతకుముందు కంటే ఒక సీటు ఎక్కువగా సాధించినప్పటికీ ఓట్ల శాతం భారీగా తగ్గింది. అదంతా తెరాసకు వెళ్లింది.
బీజేపీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు. ఇప్పటికే తమకు ఉన్న క్యాడర్ను నిలుపుకుంటూ మైనార్టీల మద్దతు కూడగట్టే ఉద్దేశ్యంలో భాగంగానే అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
కేసీఆర్ రిజర్వేషన్లకు కౌంటర్
తెలంగాణలో ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోంది. అయితే కేవలం మైనార్టీలకు ఇచ్చే అంశాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లుగా కనిపించకుండా ఉండేందుకే కేసీఆర్ తిరుమల పర్యటనపై ఎందుకు నిలదీయలేదని అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తద్వారా తాము ప్రభుత్వం తప్పు చేస్తే ఏ విషయాన్నైనా ప్రశ్నిస్తామని చెప్పడమే ఆ వ్యాఖ్యల ఉద్దేశ్యం అంటున్నారు.
తలాక్పై ఇప్పటికే సానుభూతి
తలాక్ విషయంలో మైనార్టీలలోని కొంతమంది.. ముఖ్యంగా చాలామంది మహిళలు బీజేపీపై సానుభూతితో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే తిరుపతి టూర్ పైన ప్రశ్నించాలని చెప్పడం ద్వారా.. బీజేపీ అందరిది అని చెప్పే ప్రయత్నాలు చేశారంటున్నారు. అప్పుడు బిజెపికి మైనార్టీల మద్దతు ఎంతో కొంత ఉంటుందని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
జగన్ వైపు చూస్తున్నారు
ఇక, ఆంధ్రప్రదేశ్లో టిడిపితో తెగతెంపులు చేసుకునేందుకే బిజెపి చూస్తోంది. రాష్ట్ర స్థాయి కొందరు నేతల నుంచి ఢిల్లీ స్థాయి నేతల వరకు అలాగ కనిపిస్తోంది. చంద్రబాబుకు బదులు జగన్తో వెళ్లాలని లేదా ఒంటరిగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఏపీలో మైనార్టీలు కొంత జగన్ వైపు మొగ్గు చూపుతారు. జగన్తో కలిసినా, చంద్రబాబును ఒంటరి చేసినా టిడిపికి నష్టంగానే భావిస్తున్నారు. ఏపీలో ఇలా క్యాష్ చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
చంద్రబాబుకు దెబ్బే
ఇప్పటికే తెలంగాణలో టిడిపి దాదాపు కనుమరుగయిందని చెప్పవచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు తన దృష్టిని అంతా ఏపీ పైనే పెట్టారు. ఓ వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూరమయ్యారు. బీజేపీతో కలిసే ఉందామని ఆయన భావిస్తున్నా ఆ పార్టీ మాత్రం దూరం జరుగుతోంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో టిడిపికి పెద్ద దెబ్బే అంటున్నారు. బీజేపీపై చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. కానీ అదే కమలం ఆయనను దెబ్బకొట్టబోతుందని అంటున్నారు.