సాగునీరు ప్రాజెక్టులకు పెద్ద పీట..ఈ సారి తెలంగాణ బడ్జెట్ ఎంతుంటుందో తెలుసా..?
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అయితే 2019-20కు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ఈసారి రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతుందని ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
గతేడాది రూ.1,74,453 కోట్లు
గతేడాది మార్చిలో చివరిసారిగా 2018-19కి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. గతేడాది రూ.1,74,453 కోట్లు మేరా బడ్జెట్ కేటాయించింది ప్రభుత్వం. అదే ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఆసరా పెన్షన్లలో పెంపు, రైతు బంధు పథకం కింద ఆర్థిక సహాయం పెంపు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని పెంచుతామని హామీ ఇచ్చారు.
హామీలు ఇవ్వడంతోనే బడ్జెట్లో పెంపు
ఇదిలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.41వేల కోట్లు వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఈ సారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కేటాయింపుల్లో కాస్త ఎక్కవగానే కేటాయింపులు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అనుకున్నదానికంటే ఎక్కువనే కేటాయింపులు జరగొచ్చని అధికారులు వెల్లడించారు.
సాగునీరు ప్రాజెక్టులకు అధిక కేటాయింపులు..?
ఇక బడ్జెట్లో రూ.25వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించినట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఇరిగేషన్ రంగానికి నిధుల కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. మిషన్ భగీరథను ఈ ఏడాది ఆగష్టు చివరికల్లా కంప్లీట్ చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉండటం వల్ల దీనికి నిధులు కాస్త అధికంగానే కేటాయించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎస్ఆర్ఎస్పీ కింద 14.40 లక్షల ఎకరాలకు నీరందిచాలని ప్రభుత్వం భావిస్తోంది.