విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి చోద్యం చూస్తున్నారు - పొన్నాల ఫైర్
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్ పరీక్షా ఫలితాల అవకతవకలకు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు .
ఇంటర్ బోర్డు అధికారుల నిర్వాకంతో విద్యార్ధి బలి.. అప్పుడు పాస్ , ఇప్పుడు ఫెయిల్
హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కేసీఆర్ ఫామ్హౌస్లో ఉండి చోద్యం చూస్తున్నారని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ది విధానాల సర్కార్ కాదని నినాదాల సర్కార్ అంటూ ఆయన మండిపాటుకు గురయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వైఫల్యంతోనే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు .
విద్యార్థుల మరణాలపై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. విద్యార్థులు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు . ఫామ్ హౌస్ లో ఉండి చోద్యం చూస్తున్న కేసీఆర్ కు చీమకుట్టినట్టయినా లేదని విమర్శించారు. తెలంగాణలో డ్రగ్, పబ్, ఇసుకమాఫియా బాగా రెచ్చిపోతోందన్నారు. వీటన్నింటికీ ప్రభుత్వం అండదండలున్నాయని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణా సీఎం కేసీఆర్ తప్పుచేశాడు కాబట్టే మోదీ వద్ద మోకరిల్లారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.