వీడియో: ఉక్రెయిన్ టు హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ విద్యార్థులు
హైదరాబాద్: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా రష్యా సాగిస్తోన్న దాడులతో అల్లకల్లోలంగా మారింది ఉక్రెయిన్. అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ క్షణాన బాంబు ఎక్కడ పేలుతుందో అర్థం కాని పరిస్థిితి రాజధాని కీవ్ సహా అన్ని నగరాల్లోనూ నెలకొంది. రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ను చుట్టుముట్టాయి. కీవ్ను సొంతం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను విఫలం చేస్తోంది. ఈ రెండు దేశాల సైన్యం మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతోంది.
ఇలాంటి భీతావహ వాతావరణం, సంక్షోభ పరిస్థితుల మధ్య ఉక్రెయిన్లో చదువుకుంటోన్న భారత విద్యార్థులు దశలవారీగా స్వదేశానికి చేరుకుంటోన్నారు. హంగేరి, రొమేనియా, పోలెండ్ మీదుగా వారంతా భారత్కు చేరుకుంటోన్నారు. ఉక్రెయిన్ నుంచి ఆయా దేశాల సరిహద్దుల వరకూ రోడ్డు మార్గంలో చేరుకుంటోన్నారు. వారికోసం ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.
వీడియో: ఉక్రెయిన్ టు హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ విద్యార్థులు#RussiaUkraineConflict #UkraineRussiaWar pic.twitter.com/mgARa2Bs2k
— oneindiatelugu (@oneindiatelugu) February 27, 2022
సరిహద్దులను దాటుకున్న తరువాత ఆయా దేశాల్లోని భారత ఎంబసీ అధికారులు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోన్నారు. రొమేనియా రాజధాని బుఖారెస్ట్ నుంచి శనివారం బయలుదేరిన ఎయిరిండియా ప్రత్యేక విమానంలో మరో బ్యాచ్ విద్యార్థులు ఈ తెల్లవారు జామున దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్లల్లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి మళ్లీ- తమతమ రాష్ట్రాలకు చేరుకున్నారు.

తెలంగాణకు చెందిన సుమారు 20 మంది విద్యార్థులు ఈ ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారిని రాజేంద్రనగర్ శాసన సభ్యుడు ప్రతాప్ గౌడ్ సహా స్థానిక అధికారులు, పోలీసులు సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలను ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఉక్రెయిన్ అనుభవాలను వివరించారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications