కెసిఆర్కు తన అల్లం పంటపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు: రమణ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు తన అల్లం పంటపై ఉన్న శ్రద్ధ రైతు ఆత్మహత్యల విచారణపై లేదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1700 మంది వరకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ టిడిపి ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ను కలిసింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలపై గవర్నర్కు టీడీపీ నేతలు ఓ వినతిపత్రం అందించారు. ఆ తర్వాత రమణ మీడియాతో మాట్లాడారు.

రైతుల ఆత్మహత్యల విషయాన్ని కేంద్రంపై నెపం నెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని ఆయన అన్నారు. ఏకకాలంలో రైతులకు రుణాలు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ రుణాలపై మారిటోరియం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
పత్తిపంటకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో పత్తి పంటకు అక్కడి రాష్ట్రాలు బోనస్ ను చెల్లిస్తున్నాయని, ఆ విధంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా బోనస్ చెల్లించాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలోని రైతులకు బ్యాంకులు 30 శాతానికి మించి రుణాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడం వల్ల వెంటనే కొత్త రుణం లభిస్తుందని, తద్వారా రైతులు పెట్టుబడులు పెట్టుకునే అవకాశం ఉండేదన్నారు. రుణమాఫీ కానందువల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
కొత్త రుణాలు లభించక రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆరు లక్షల రూపాయలేసి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications