తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. త్వరలోనే వారికి రూ. 6 వేల పెన్షన్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తూ వస్తోంది. అయితే రాష్ట్రంలో అర్హులైన కవులు, కళాకారులకు రూ. 6వేలు పింఛన్ అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయంతెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అంటేనే కవులు, కళాకారులకు పుట్టినిల్లు. ఉద్యమ సమయంలో ఎంతోమంది కవులు, కళాకారులు తెలంగాణ సంస్కృతిని తమ ఆట, పాటలతో ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అలాంటి కళాకారులను గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణలోని కవులు, కళాకారులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో తమ ఆట, పాటలతో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు చాటి చెప్పిన కవులు, కళాకారులకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులైన వృద్ధ కళాకారులకు పెన్షన్ లు ఇచ్చి ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.
తమకు పింఛన్ తో పాటు ఆరోగ్య బీమా సదుపాయం, ప్రత్యేక హెల్త్ కార్డులు,గుర్తింపు కార్డులు జారీ చేయాలని కళాకారులు తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి విజ్ఞప్తి చేయడంతో ఆయన ఈ విషయంపై పాజిటివ్ గా స్పందించారు. ఈ మేరకు అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పింఛన్లు ఇచ్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. కళా రంగానికి, కళాకారులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు.

గతంలోనూ మంత్రి జూపల్లి ఇదే విషయంపై ప్రస్తావిస్తూ.. తెలంగాణ సాధన ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరువలేనిదని అన్నారు. అర్హులైన కళాకారులందరికీ రూ.6 వేల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications